మెగాస్టార్ చిరంజీవి సేవాగుణం గురించి, దాతృత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇండస్ట్రీలో ఎవరికైనా కష్టం వస్తే నేనున్నానంటూ ఆపద్భాంధవుడుగా నిలిచే చిరు.. గత కొన్నేళ్లుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బ్ల‌డ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులు స్థాపించి ఎందరి ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నారు. కేవలం తన అభిమానులకే కాకుండా తోటి కళాకారులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులు, స్నేహితులకు కూడా ఆయన అండగా నిలుస్తూ ఉంటారు. అయితే ఎంత చేసినా చిరు ఎప్పుడూ తన సహాయం గురించి చెప్పుకోరు. సాయం పొందిన వ్యక్తులు బయటకు చెప్పినప్పుడు మాత్రమే అందరికీ తెలుస్తుంటాయి. తాజాగా మెగాస్టార్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. అనారోగ్యం బారిన పడిన చిన్ననాటి మిత్రుడికి మర్చిపోలేని సాయం చేసి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 


చిరంజీవి బాల్యం అంతా మొగల్తూరులో గడిచిందనే సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు పువ్వాడ రాజా అనే చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు. అయితే ఆ మధ్య అతని ఆరోగ్యం దెబ్బ తినింది. ఈ విషయం తెలుసుకున్న చిరు స్వయంగా రాజాకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆ కుటుంబానికి క‌ష్ట కాలంలో అండ‌గా నిలుస్తాన‌ని భ‌రోసానిచ్చారు. ఈ క్రమంలో ఇటీవల ఆయన్ను హైదరాబాద్‌ లోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేయించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా చిరు హాస్పిటల్ కు వెళ్లి మిత్రుడిని పలకరించి, వైద్యుల నుంచి రాజా ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 






Also Read: విక్రమ్‌ సింగ్ రాథోడ్‌ తర్వాత నాకు సంతృప్తినిచ్చిన పాత్ర ఇదే: రవితేజ


స్నేహితులకు బాగోకపోతే ఎక్కడ డబ్బు సాయం చేయాల్సి వస్తుందని తప్పించుకొని తిరిగే ఈరోజుల్లో.. ఎప్పుడో చిన్నప్పుడు తనతో కలిసి తిరిగిన మిత్రుడిని హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్న చిరంజీవి ఎందరికో ఆదర్శంగా నిలిచారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల చిరు మోకాలికి చిన్న సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అందుకే ఈ మధ్య పెద్దగా బయటకు రావడం లేదు. అయితే ఇప్పడిప్పుడే కోలుకుంటున్న ఆయన తన ఫ్రెండ్ బాగోగులు తెలుసుకోడానికి స్వయంగా హాస్పిటల్ కు వెళ్లి పలకరించడం గొప్ప విషయమని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. బండ్ల గణేష్ సైతం చిరుని ట్యాగ్ చేస్తూ 'మీరు గ్రేట్‌ సర్‌' అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ గా మారాయి.


ఇక సినిమాల విషయానికొస్తే.. 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు చిరంజీవి. అయితే మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన ‘భోళా శంకర్‌’ చిత్రంతీవ్ర నిరాశ పరిచింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చూసింది. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు వహిస్తున్న చిరు.. ప్రస్తుతం రెండు సినిమాలను లైన్ లో పెట్టారు. ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేయడానికి రెడీ అయ్యారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఈరోజు దసరా సందర్భంగా ప్రారంభం కానుందని సమాచారం. మరోవైపు కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాణంలో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు మెగాస్టార్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి.


Also Read: 'ఆదిత్య - 999 మ్యాక్స్' స్టోరీని ఒక్క రాత్రిలో రెడీ చేసేశా, మోక్షజ్ఞ ఎంట్రీ అప్పుడే: బాలకృష్ణ 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial