నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అదిగో ఇస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు అంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంత వరకూ వెండి తెర మీదకు రాలేదు. తనయుడి తెరంగేట్రాన్ని రెండేళ్ల క్రితమే కన్ఫర్మ్ చేసిన బాలయ్య.. డెబ్యూ మూవీని మాత్రం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. తాజాగా మరోసారి మోక్షు ఎంట్రీ గురించి మాట్లాడారు. 


బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'భగవంత్‌ కేసరి' ఇటీవలే విడుదలైంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని బాలకృష్ణ, శ్రీలీల స్పెషల్ ఇంటర్వ్యూని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో భాగంగానే మోక్షజ్ఞ తెరగేట్రంపై స్పందించారు బాలయ్య. వచ్చే ఏడాది డెబ్యూ ఇస్తాడని, అతని కెరీర్ పై తనకు ఎలాంటి టెన్షన్ లేదని అన్నారు.


'మీ అబ్బాయి డెబ్యూ ఎప్పుడు ఉంటుంది?' అని శ్రీలీల ప్రశ్నించగా.. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది బాలయ్య బదులిచ్చారు. "మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరితో అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడూ మెంటల్ గా ఏదీ ప్రిపేర్ అవ్వను. ఇదని అదని నేను ఏవీ ప్లాన్ చేయను. రేపు షూటింగ్ అంటే, ఈరోజు కథ రెడీ అయిపోతుంది. నేను ఆ స్పీడ్ లో వెళ్తుంటాను. నా స్పీడ్ ఎవ్వరూ తట్టుకోలేరు. మోక్షు భవిష్యత్ గురించి నాకు అస్సలు దిగులే లేదు. ఎందుకంటే, నా దగ్గరే బోలెడన్ని సబ్జెక్టులు ఉన్నాయి" అని బాలకృష్ణ తెలిపారు.


Also Read: 'ఆయన అఛీవర్‌, నేను అఛీవ్‌మెంట్‌ మాత్రమే'.. బన్నీ ఎమోషనల్‌ స్పీచ్‌!


"మోక్షజ్ఞ మొదటి సినిమా ఏదవుతుందో నాకు తెలియదు. ఫస్ట్ సినిమా నాదే కావొచ్చు, లేదా రెండో సినిమా అవ్వొచ్చు. నా 'ఆదిత్య 999 మ్యాక్స్' సబ్జెక్ట్ సిద్ధంగా ఉంది. ఆ స్టోరీ ఒక్క రాత్రిలో రెడీ చేశాను. అది కూడా ఆ నైట్ నేను పడుకున్నా, ఆసువుగా కథ వచ్చేసింది. ఆ కథ ప్రిపేర్ అయింది కాబట్టి గొడవ లేదు. ఇంకో కథ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. మరో నాలుగైదు రకాల కథలు కూడా ఉన్నాయి. అందుకే మోక్షు ఫ్యూచర్ గురించి నాకు దిగులే లేదు. నా దగ్గర ఫెంటాస్టిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది చూడాలి" అని బాలయ్య అన్నారు.


"రామరావు మనవడు అనో, బాలకృష్ణ కొడుకు అనో కాదు.. నేను సబ్జెక్ట్ కి ప్రాధాన్యత ఇస్తాను. లెగసీని ముందుకి తీసుకెళ్లాలనే భారం అతని మీద వుంది. దానికి తగ్గట్టుగా నాకు సినిమాల మీదున్న అవగాహనతో ఒత్తిడి లేకుండా మోక్షజ్ఞను ఇండస్ట్రీకి తీసుకొస్తాను. ఆ తర్వాత అతనే దాన్ని ముందుకు తీసుకెళ్తాడు" అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.


కాగా, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో నటించిన క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్ చేయనున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించారు బాలకృష్ణ. స్వయంగా 'ఆదిత్య 999 మ్యాక్స్' కథ రెడీ చేసినట్లుగా వెల్లడించారు. మరి నందమూరి మోక్షజ్ఞ ఈ స్టోరీతో ఎంట్రీ ఇస్తాడా, లేదా మరేదైనా సినిమాతో ఆరంగేట్రం చేస్తాడా అనేది వేచి చూడాలి.


Also Read: విక్రమ్‌ సింగ్ రాథోడ్‌ తర్వాత నాకు సంతృప్తినిచ్చిన పాత్ర ఇదే: రవితేజ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial