దర్శకుడు అజయ్ భూపతి నిర్మొహమాటంగా, నిజాయతీగా మాట్లాడతారు. అంతా ఓపెన్! 'మంగళవారం' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా తనకు సహజ శైలిలో ఆయన మాట్లాడారు. ఫ్లాప్ సినిమాలను సైతం హిట్ అని చెప్పే దర్శక నిర్మాతలు మనకు కనిపిస్తారు. కానీ, అజయ్ భూపతి మాత్రం అలా కాదు. తాను తీసిన సినిమా సరిగా ఆడలేదని స్టేజి మీద చెప్పారు. ఆ సమయంలో చిత్రసీమలో కొందరి తీరు ఏ విధంగా ఉందో కూడా వివరించారు.


'మహాసముద్రం' ఫ్లాప్ తర్వాత పక్కకి తప్పుకొన్నారు! 
'ఆర్ఎక్స్ 100'తో అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్. తెలుగులో కొత్త తరహా సినిమాలకు నాంది పలికింది. అయితే... రెండో సినిమా 'మహాసముద్రం'తో అంచనాలు అందుకోలేదు. ఆ సినిమా ఫ్లాప్ అని 'మంగళవారం' ప్రీ రిలీజ్ వేడుకలో అజయ్ భూపతి అంగీకరించారు.


''నేను ఇంతకు ముందు తీసిన రెండు సినిమాల్లో ఒకటి ఆడితే... మరో సినిమా ఆడలేదు. ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంటుందట... ఫ్లాప్ తర్వాత వెళ్తుంటే పక్కకి తప్పుకొనేవారు. 'మహాసముద్రం' భారీ విజయం సాధించినా నేను 'మంగళవారం' తీసేవాడిని. ఇది హీరో లేని సినిమా అనుకోవద్దు. థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే చిత్రమిది. చెన్నైలో మిక్సింగ్ పూర్తి అయ్యింది. సినిమా చూశా. అజనీష్ నెక్స్ట్ లెవల్ మ్యూజిక్ ఇచ్చారు'' అని అజయ్ భూపతి చెప్పారు.


కథ రాస్తున్నప్పుడు చేతులు వణికాయి!
'మంగళవారం' ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాతలలో ఒకరైన స్వాతికి ఆయన క్లోజ్ ఫ్రెండ్. అందుకని, ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ముందు అజయ్ భూపతిని పిలిచి కథ విన్నారు. అప్పుడు 'మీరు శభాష్ అనేలా సినిమా తీస్తా' అని బన్నీ గారికి మాట ఇచ్చానని, ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్ ఆయనకు నచ్చి ఉంటాయని ఆశిస్తున్నట్లు అజయ్ భూపతి తెలిపారు. సినిమా కూడా నచ్చుతుందని చెప్పారు. తమ వేడుకకు వచ్చిన ఆయనను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని, ఆయన రావడం ద్వారా తమ సినిమా ప్రచారం ఆకాశానికి చేరిందన్నారు.


Also Read టైగర్ 3 రివ్యూ : దీపావళికి సల్మాన్ యాక్షన్ ధమాకా సౌండ్ చేస్తుందా? సినిమా హిట్టా? ఫట్టా?


ఇంకా అజయ్ భూపతి మాట్లాడుతూ ''సినిమాలో ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమా చూసిన ప్రేక్షకులు క్యారెక్టర్లను రివీల్ చేయవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. విలేజ్ నేటివిటీ రస్టిక్ మిస్టీరియస్ థ్రిల్లర్. స్వాతి గారు క్లాస్. నేను మాస్. ఆవిడకు ఈ కథ నచ్చదని చెప్పే ముందు అనుకున్నా. అయితే... స్వాతి గారికి కథ విపరీతంగా నచ్చింది. ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ టచ్ ఉన్న కథ. అయితే... వెరీ కాంప్లికేటెడ్ పాయింట్ ఉంది. ఇండియాలో ఎవరు టచ్ చేయని పాయింట్ ఉంది. కథ రాస్తున్నప్పుడు చేతులు వణికాయి. దర్శకుడిగా నాకొక సవాల్ విరిసిన చిత్రమిది. మొత్తం వంద రోజులు అవుట్ డోర్ షూటింగ్ చేశాం. బడ్జెట్ పెరిగింది. ప్రేక్షకులకు హై క్వాలిటీ సినిమా ఇవ్వడం కోసం కష్టపడ్డాం. వంద శాతం చెబుతున్నా... నెక్స్ట్ లెవల్ సినిమా ఇది'' అన్నారు. 


Also Read మరణించిన మూడో రోజున చంద్రమోహన్ అంత్యక్రియలు - రెండు రోజులు ఆలస్యానికి కారణం ఏమిటంటే?