సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie). దీనికి మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్నారు. 'అతడు', 'ఖలేజా' విజయాల తర్వాత వాళ్ళిద్దరి కలయికలో హ్యాట్రిక్ చిత్రమిది. 


మినిమమ్ మూడు నెలలు బ్యాలెన్స్!
జనవరి నుంచి 'గుంటూరు కారం' సినిమా చిత్రీకరణ శరవేగంగా చేస్తున్నారు. హీరో మహేష్, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా... కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్లు కొన్ని తెరకెక్కించారు. అయితే... ఇంకా 80 రోజుల వర్క్ బ్యాలెన్స్ ఉందట. ఎలా లేదన్నా మినిమమ్ మూడు నెలలు షూటింగ్ చేయాలని సమాచారం. ప్యాచ్ వర్క్, ఇతర షూటింగ్ పనులు అన్నీ అక్టోబర్ లేదా నవంబర్ నెలకు ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. 


'గుంటూరు...'లో  ఓ అందాల ఘాటు!
'గుంటూరు కారం'లో ఇద్దరు హీరోయిన్లున్నారు. అందులో శ్రీలీల (Sreeleela) ఒకరు. ఆమె పుట్టినరోజు సందర్భంగా బుధవారం (జూన్ 14న) ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చీర కట్టుకుని నెయిల్ పోలిష్ వేసుకుంటూ... అందాల బొమ్మలా మెరిసిపోయారు. లుక్ చూస్తుంటే... సినిమాలో ఆమె సంప్రదాయబద్ధంగా కనిపించే పాత్రలో సందడి చేస్తారని అర్థం అవుతోంది.


Also Read 'సైతాన్' రివ్యూ : బోల్డ్ సీన్స్, బ్రూటల్ కిల్లింగ్స్ - హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?



'మాస్ స్ట్రైక్'కు రెస్పాన్స్ మామూలుగా రాలేదు!
మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా సినిమా టైటిల్ వెల్లడించారు. 'మాస్ స్ట్రైక్' పేరుతో వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఆ విజువల్స్ సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ ఎవరూ మహేష్ బాబును చూపించనటువంటి మాస్ అవతారంలో త్రివిక్రమ్ చూపించారు. మిర్చి యార్డులో ఫైట్స్ విజువల్స్ ఘట్టమనేని అభిమానులను మాత్రమే కాదు... సగటు సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. 


మాస్ యాక్షన్ ఫిల్మ్ గురూ!
కర్రసాముతో రౌడీలను చితక్కొడుతూ 'మాస్ స్ట్రైక్'లో మహేష్ బాబు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. గళ్ళ చొక్కా, తలకి ఎర్ర కండువా... ఆయన సరికొత్త మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నోటిలో నుంచి బీడీ తీసి, స్టైలుగా వెలిగించి 'ఏంది అట్టా చూస్తున్నావు... బీడీ త్రీడీలో కనపడుతుందా" అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పి ఎప్పటిలా ఫిదా చేశారు మహేష్. గుంటూరు నేపథ్యంలో మాస్ అండ్ స్టైలిష్ యాక్షన్ ఫిలింగా 'గుంటూరు కారం'ను రూపొందిస్తున్నారు. 'మాస్ స్ట్రైక్'కు తమన్ ఇచ్చిన నేపథ్యం సంగీతం పూనకాలు తెప్పించింది.


Also Read 'జీ కర్దా' రివ్యూ : ప్రేమకు, పెళ్లికి మధ్య డౌట్ వస్తే - తమన్నా వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?






'గుంటూరు కారం'లో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే మరో కథానాయికగా నటిస్తున్నారు. 'మహర్షి' తర్వాత వాళ్ళిద్దరి కలయికలో చిత్రమిది.  ఇందులో జగపతి బాబు సైతం కీలక పాత్ర చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.