Actor Dhanush Paternity Case: తమిళ అగ్రహీరో ధనుష్ కు సంబంధించిన కేసు విషయంలో మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 8 ఏండ్లుగా కొనసాగుతున్న ఈ కేసుకు ఫుల్ స్టాఫ్ పెట్టింది. ధనుష్‌ తమ కొడుకే అని పేర్కొంటూ మేలూర్‌ కోర్టులో కదిరేశన్‌ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ధనుష్ వారి కొడుకు అని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవంటూ కేసును డిస్మిస్ చేసింది.


ఇంతకీ అసలు కేసు ఏంటంటే?


మేలూర్‌ కు చెందిన కదిరేశన్‌, మీనాక్షి దంపతులు, నటుడు ధనుష్‌ తమ కొడుకు అంటూ 2015లో మేలూర్‌ కోర్టులో కేసు వేశారు. స్కూల్‌లో చదువుతున్న రోజుల్లోనే ధనుష్‌ ఇంట్లో నుంచి పారిపోయాడని కోర్టుకు తెలిపారు. అతడు తమ కొడుకే అని చెప్పేందుకు ఆధారంగా బర్త్‌ సర్టిఫికేట్, టెన్త్‌ క్లాస్‌ టీసీ, 2002లో జాబ్ కోసం ఎంప్లాయిమెంట్‌ ఆఫీస్ లో ధనుష్ ఎంట్రీ చేయించుకున్న సర్టిఫికేట్ ను కోర్టుకు అందించారు. ఈ ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం చివరకు కొట్టివేసింది. కదిరేశన్ దంపతులు సమర్పించిన ఆధారాలతో ధనుష్ వారి కొడుకే అని చెప్పలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.


డబ్బు కోసమే కేసు వేశారన్న ధనుష్ న్యాయవాదులు


కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కొడుకేనని చేస్తున్న వాదనలో నిజం లేదని ధనుష్ తరఫున న్యాయవాదులు కోర్టులో వాదించారు. కదిరేశన్‌ కోర్టుకు ఇచ్చిన టీసీలో ఉన్న పుట్టుచ్చలు, ధనుష్ కు లేవని చెప్పారు. కోర్టు వారు పరిశీలించి తను నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాదు, ధనుష్‌ తమ కొడుకే అని చెప్పడంతో పాటు ప్రతి నెల తమ ఖర్చులకు రూ. 65 వేలు ఇప్పించాల్సిందిగా కోర్టును కదిరేశన్‌ దంపతులు కోరారని, కేవలం డబ్బు కోసమే వాళ్లు ఈ కేసును వేశారని ధనుష్ తరఫు వకీళ్లు వాదించారు.  


పుట్టు మచ్చలపై కీలక విచారణ


కదిరేశన్ దంపతులు సమర్పించిన టీసీలో ఉన్న పుట్టుమచ్చలపైన కోర్టులో కీలక విచారణ జరిగింది. కోర్టు రిజిస్టార్‌ ఆధ్వర్యంలోనే మేలూర్‌ రాజాజీ ప్రభుత్వాసుపత్రి డీన్‌ ధనుష్‌ పుట్టు మచ్చలను పరిశీలించారు. కదిరేశన్ దంపతులు చెప్పినట్టుగా ధనుష్‌ కు పుట్టుమచ్చలు లేవని తేల్చారు. దీంతో న్యాయస్థానం కదిరేశన్ పిటిషన్‌ను కొట్టివేసింది. మొత్తంగా ఎనిమిదేళ్ల పాటు అనేక అధారాలపై విచారణ జరిపిన కోర్టు కదిరేశన్, మీనాక్షి దంపతుల కొడుకు కాదని తేల్చింది. కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతులకే ధనుష్‌ జన్మించినట్లు కీలక తీర్పును ప్రకటించింది.  


‘కుబేర‘ సినిమా షూటింగ్ లో ధనుష్ బిజీ


ప్రస్తుతం ధనుష్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. శివరాత్రి రోజున ‘కుబేర‘ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ధనుష్ ఓ బిచ్చగాడిలా కనిపించాడు. ఈ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. 


Read Also: నా భర్త నన్ను వేలం వేశాడు, తన ఫ్రెండ్స్‌తో అలా చేయాలని ఒత్తిడి చేశాడు: కరిష్మా కపూర్ షాకింగ్ కామెంట్స్