Maa Navatihi Utsavam: తెలుగు సినిమా పరిశ్రమ 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న వేళ 'నవతిహి ఉత్సవం' నిర్వహించేందుకు 'మా' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) రెడీ అవుతోంది. మలేషియాలో ఈ చారిత్రాత్మక ఈవెంట్ ఏర్పాటు చేయబోతోంది. ఈ విషయాన్ని  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు వెల్లడించారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ వేడుకకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు.


తెలుగు సినిమా పరిశ్రమ కీర్తిని చాటేలా 'నవతిహి ఉత్సవం'- మంచు విష్ణు


తెలుగు సినిమా పరిశ్రమ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా 'నవతిహి ఉత్సవం' నిర్వహించబోతున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు. “ రెండేళ్ల క్రితం 90 ఏళ్ల తెలుగు సినిమా వేడుకను నిర్వహించాలి అనుకున్నాం. తెలుగు సినీ పరిశ్రమ ప్రారంభ నుంచి ఇండస్ట్రీకి సేవ చేసిన నటీనటులను గుర్తు చేసుకుంటూ ఈ ఈవెంట్ ను అట్టహాసంగా ఏర్పాటు చేయాలని  భావించాం. అనివార్య కారణాల వల్ల ఈ వేడుక వాయిదా పడుతూ వస్తోంది. మలేషియా ప్రభుత్వంతో కలిసి ఈ వేడుక నిర్వహించబోతున్నాం. ఈవెంట్ కు సంబంధించిన డేట్స్ ఇంకా ఫిక్స్ కాలేదు. సినీ పరిశ్రమ పెద్దలతో మాట్లాడి త్వరలోనే డేట్ అనౌన్స్ చేస్తాం. సినిమా పరిశ్రమకు చెందిన అందరూ ఈ వేడుకలో పాల్గొనేలా చేస్తాం.  తెలుగు సినిమా ఘన కీర్తిని తెలిపేలా ఈ ‘నవతిహి ఉత్సవం’ చేయబోతున్నాం” అని చెప్పారు.


'నవతిహి ఉత్సవం' నిర్వహించేందుకు ఇదే సరైన సమయం- విష్ణు


తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోందని చెప్పిన విష్ణు.. తెలుగు నటీనటులం అని చెప్పుకునేందుకు గర్విస్తున్నట్లు వెల్లడించారు. “తెలుగు సినిమా పరిశ్రమకు ఇప్పుడు గోల్డెన్ ఎరా నడుస్తోంది. తెలుగు నటీనటులుగా మేమంతా గర్విస్తున్నాము. అమితాబ్, అనీల్ కపూర్ లాంటి నటులను సినిమాలకు తెలుగువారే పరిచయం చేశారు. మెగాస్టార్ గారికి పద్మ విభూషణ్ రావడం చాలా గొప్ప విషయం. జై బాలయ్య అనే మాట ఎక్కడికి వెళ్లినా వినిపిస్తుంది. అల్లు అర్జున్ ఫస్ట్ తెలుగు హీరో నేషనల్ అవార్డ్ తీసుకొచ్చారు. ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ గా మారారు. రాజమౌళి తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసారు. మహేష్ రాజమౌళి సినిమా ఏషియాలోనే  బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా కాబోతుంది. కీరవాణి ఫస్ట్ ఆస్కార్ పొందిన తెలుగు సంగీత దర్శకుడు. అందుకే ఇప్పుడు 'నవతిహి ఉత్సవం' నిర్వహించుకోవడం సరైన సమయం అని భావిస్తున్నాం. మలేషియా ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ కోసం మూడు రోజులు సినిమా ఇండస్ట్రీకి  సెలవులు ఇవ్వాలని కోరాము.  ఈవెంట్ కి వేరే పరిశ్రమ నటీనటులు కూడా కొంతమంది రాబోతున్నారు' అని తెలిపారు.



మలేషియా ప్రభుత్వానికి ధన్యవాదాలు- ధాతుక్ కమలనాథన్


మలేషియా వేదికగా 'నవతిహి ఉత్సవం' ఘనంగా నిర్వహించే అవకాశం కల్పించినందుకు అడ్వైజర్ ధాతుక్ కమలనాథన్ 'మా'  ప్రెసిడెంట్ విష్ణుకు ధన్యవాదాలు చెప్పారు. “మంచు విష్ణు గారు ఈ ఈవెంట్ నిర్వహించే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఆయనతో మాట్లాడిన ప్రతిసారి మా గురించి, మా సభ్యులకు చేయాల్సిన పనుల గురించి, ఇన్సూరెన్స్ ల గురించి, మెడికల్ గురించి, ఆర్టిస్ట్ ల పిల్లల ఎడ్యుకేషన్ గురించి మాట్లాడేవారు. ఇప్పుడు మా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ ను మలేషియాలో గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయబోతున్నాము. ఈ వేడుకకు సహకరిస్తున్న మలేషియా ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని తెలిపారు.  


‘మా’తో కలిసి ఈ వేడుక నిర్వహించడం సంతోషకరం- మలేషియా టూరిజం డైరెక్టర్


‘మా’తో కలిసి మలేషియా ప్రభుత్వం ఈ వేడుక నిర్వహించడంతో సంతోషంగా ఉందని మలేషియా టూరిజం డైరెక్టర్ ఇండియా, శ్రీలంక ప్రతినిధి రాజౌది అబ్దుల్ రాహిమ్ తెలిపారు. “జులైలో 'మా' ఈవెంట్ మలేషియాలో జరగబోతుంది. ఈ ఈవెంట్ తో మలేషియా కొలాబరేట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. విష్ణు మంచు గారికి ధన్యవాదాలు. ఇండియా - మలేషియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. టూరిజం మలేషియా ఈ ప్రోగ్రాంకి సపోర్ట్ చేస్తున్నందుకు మా టూరిజం ఇండస్ట్రీకి కూడా చాలా ఉపయోగపడుతుంది. అందరం మలేషియాలో కలుద్దాం” అని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో  'మా' ప్రసిడెంట్ విష్ణు మంచుతో పాటు వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ, ఈసీ మెంబర్స్, పలువురు మలేషియా ప్రతినిధులు పాల్గొన్నారు.


Read: అక్కడ రాజు, ఇక్కడ బానిస- ‘ది గోట్ లైఫ్’ గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్