Prithviraj Sukumaran About ‘The Goat Life’ Movie: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మలయాళంతో పాటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. చక్కటి యాక్టింగ్ తో సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. రీసెంట్ గా ‘సలార్’ మూవీలో ప్రభాస్ స్నేహితుడిగా నటించారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియన్ మూవీలో వరదరాజ మన్నార్ అనే రాజు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంతో తెలుగులో ఆయన ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగింది.  


మార్చి 28న ‘ది గోట్ లైఫ్’ విడుదల


ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న చిత్రంతో అభిమానులను అలరించబోతున్నారు. ‘ది గోట్ లైఫ్’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రం ‘ఆడుజీవితం’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కిస్తున్నారు.బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. మార్చి 28న మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రబ్యూషన్ సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు.


అప్పుడు రాజు-ఇప్పుడు బానిస!


హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్ తో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక విషయాలు వెల్లడించారు. “సలార్ మూవీలో వరదరాజ మన్నార్‌ అనే రాజు పాత్రలో కనిపించాను. ఇప్పుడు ‘ది గోట్ లైఫ్’ మూవీలో బానిసగా నటించాను. ఇది వాస్తవ సంఘటనలను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం. ఇందులో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాను. ఈ సినిమాను చూస్తున్న ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్ గా ఫీలవుతారు” అని చెప్పుకొచ్చారు. ఎప్పుడో అనుకున్న ఈ సినిమాను ఇప్పుడు విడుదల చేస్తున్నామని పృథ్వీరాజ్ తెలిపారు. “ఈ సినిమాను 2008లో అనుకున్నాం. 2024లో రిలీజ్ చేస్తున్నాం. ఈ ఒక్క సినిమా కోసం 16 ఏండ్లు ప్రయాణం చేశాం. ఈ సినిమా కోసం తొలుత బరువు పెరిగాను. ఆ తర్వాత 31 కిలోలు తగ్గాల్సి వచ్చింది” అని చెప్పారు.






చిరంజీవితో తప్పకుండా సినిమా చేస్తా!


మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం రెండుసార్లు వచ్చినా చేయలేకపోయానని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. మున్ముందు మళ్లీ అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో కలిసి వర్క్ చేస్తానని చెప్పుకొచ్చారు. “ ‘సైరా నరింహారెడ్డి’ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నన్ను అడిగారు. కానీ, అప్పుడు ఈ సినిమా(‘ది గోట్ లైఫ్’) కోసం రెడీ అవుతున్నాను. ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్’ సినిమాకు నన్నే దర్శకత్వం వహించాలని చెప్పారు. అప్పుడు కూడా ఇదే సినిమా బిజీలో ఉండి చేయలేనని చెప్పారు. నువ్వు మళ్లీ అదే స్టోరీ చెప్తున్నావు అని చిరంజీవి అన్నారు. మరోసారి అవకాశం వస్తే ఆయనతో తప్పకుండా కలిసి నటిస్తాను” అని వెల్లడించారు.


Read Also: ‘ఎర్త్ అవర్’ రోజు లైట్లు ఎందుకు ఆర్పేయాలి? హైదరాబాద్‌లో ఈ టైమ్‌లో లైట్స్ అన్నీ బంద్!