సోమవారం ఉదయం నుంచి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు ఓ గుడిలో అవమానం జరిగింది అనే వార్తలు జోరుగా వినిపించాయి. సోషల్ మీడియా మొత్తం దానికి సంబంధించిన వీడియోనే చక్కర్లు కొట్టింది. అయితే చూసిందంతా నిజం కాదు అన్నట్టుగా తాజాగా ఈ వివాదంపై ఇళయరాజా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ ఫేక్ వార్తలు అంటూ ఆయన కొట్టి పారేశారు.
ఆ గుడిలో వివాదం ఏంటంటే?
దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఆలయంలో అవమానం అంటూ నిన్న మొత్తం సోషల్ మీడియా కోడై కూసింది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయంలో దర్శనానికి వెళ్లారు ఇళయరాజా. కానీ గర్భగుడిలోకి దర్శనానికి వెళ్లిన ఇళయరాజాను అక్కడున్న పూజారులు బయటకు పంపించినట్టుగా ఉన్న వీడియో నిన్న సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. డిసెంబర్ 16 నుంచి మార్గశిర మాసం స్టార్ట్ అవుతుండడంతో శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలోని ఆండాళ్, రంగమన్నారన్ ను దర్శించుకోవడానికి ఇళయరాజా గుడికి వెళ్ళినట్టు తెలుస్తోంది. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీ ఆండాళ్ జీయర్ మఠానికి చెందిన సడగోప రామానుజ అయ్యర్, సడగోప రామానుజ జీయర్లతో కలిసి ఇళయరాజా పూజలో పాల్గొన్నారు. అలాగే ఈ శుభ సందర్భంగా ఇళయరాజా స్వరపరిచిన 'దివ్య పాసురం'ని విడుదల చేయడానికి ఆలయానికి వెళ్లారు.
అలాంటి టైంలో ఇళయరాజాను గర్భగుడిలోకి రానివ్వకపోవడం అనేది ఆలయ నిర్వాహకులపై ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది. మొత్తానికి ఇళయరాజా అర్థ మండపం మెట్ల దగ్గరే నిలబడి ఆలయం మర్యాదలను స్వీకరించి, స్వామివారిని దర్శించుకున్నారు. కానీ సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోపై చాలామంది ఫైర్ అవుతూ కామెంట్స్ చేశారు. ఇంతటి సంగీత విద్వాంసుడికి దక్కాల్సింది ఇలాంటి గౌరవమేనా? అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ వైరల్ వీడియోతో పాటు తనను అవమానించారంటూ వస్తున్న వార్తలపై తాజాగా ఇళయరాజా స్పందించారు.
వివాదంపై ఇళయరాజా పోస్ట్
వైరల్ వీడియోపై వస్తున్న వార్తలు ఫేక్ అంటూ ఇళయరాజా పోస్ట్ చేశారు. ఆ వార్తలపై ఇళయరాజా స్పందిస్తూ "కొంతమంది ఫాల్స్ రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో ఏ సమయంలో లేదా ఏ ప్లేస్ లోనూ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాను. అసలు అక్కడ ఏం జరగకపోయినా జరిగినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వదంతులను అభిమానులు, ప్రజలు నమ్మొద్దు" అంటూ ఆ వివాదంపై ఇళయరాజా క్లారిటీ ఇచ్చారు.
ఇళయరాజా బయోపిక్
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తుండగా, అరుణ్ మాథేశ్వరం దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తన బయోపిక్ కు స్వయంగా ఇళయరాజా సంగీతం అందించబోతున్నారు. ఈ ఏడాది మార్చి 20న కమల్ హాసన్, వెట్రి మారన్, గంగై అమరెన్, భారతీరాజా సమక్షంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు మేకర్స్. ఇక ఇళయరాజా వంటి దిగ్గజ సంగీత దర్శకుడి బయోపిక్ లో భాగం కావడంపై ధనుష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.
Read Also : Ram Charan Leaks: చిరు దారిలోనే రామ్ చరణ్ - ‘గేమ్ చేంజర్’లో ఆ ఇద్దరు!