కరోనా పాండమిక్ కు ముందు డిసెంబర్ నెలను సినిమాలకు మంచి సీజన్ గా భావించేవారు. నవంబర్ వంటి డ్రై సీజన్ తర్వాత, చలికాలం జనాలు థియేటర్లకు వస్తారని అనుకునేవారు. అందుకే ఫిలిం మేకర్స్ అందరూ అదే సమయంలో తమ చిత్రాలని రిలీజ్ చేయటానికి ఆసక్తి కనబరిచేవారు. క్రిస్మస్ హాలిడేస్ కూడా కలిసొస్తాయి కాబట్టి పెద్ద హీరోల సినిమాలు, క్రేజీ చిత్రాలని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ట్రై చేసేవారు. అయితే కోవిడ్ తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి. 


2021 డిసెంబర్ లో 'పుష్ప', 'అఖండ' వంటి రెండు పెద్ద సినిమాలు మాత్రమే విడుదలైతే.. 2022లో 'ధమాకా', 'హిట్ 2' చిత్రాలు వచ్చాయి. కానీ ఈ ఏడాది మాత్రం అనేక సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. 2023 డిసెంబర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ రష్ చూడబోతున్నాం. తెలుగు సినిమాలే కాకుండా, పలు క్రేజీ డబ్బింగ్ చిత్రాలు ఈ యేడాది చివర్లో సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయగా, మరికొన్ని చిత్రాలు స్లాట్స్ కోసం ట్రై చేస్తున్నాయి. 


 


యానిమల్:


'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'యానిమల్'. గ్యాంగ్ స్టర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. రష్మిక మందన్న, తృప్తి దిమ్రి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ కుమార్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముందుగా ఆగస్టు రెండో వారంలో రిలీజ్ చేయాలని భావించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని, 2023 డిసెంబర్ 1వ తేదీకి వాయిదా వేశారు. ఇది హిందీతో పాటుగా తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదల కానుంది. 


కెప్టెన్ మిల్లర్:


'సార్' తర్వాత తమిళ్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం 'కెప్టెన్ మిల్లర్'. అరుణ్‌ మాథేశ్వరన్‌ ఈ పాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సందీప్ కిషన్, శివ రాజ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ధనుష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు. 2023 డిసెంబర్ 15న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. 


Also Read: హిట్టు కొట్టాలంటే గన్ను పట్టాల్సిందే - ఈ గన్స్ లేకపోతే ఏమైపోయేవారో!


హాయ్‌ నాన్న:


'దసరా' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత న్యాచురల్ స్టార్‌ నాని నటిస్తోన్న సినిమా 'హాయ్‌ నాన్న'. ఇది నానికి  30వ సినిమా. శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీలో మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై మోహన్‌ చెరుకూరి, విజయేందర్‌ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల టైటిల్ గ్లింప్స్‌ రిలీజ్‌ చేసిన మేకర్స్.. విడుదల తేదీని కూడా ప్రకటించేసారు. క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. 


సైంధవ్:


విక్టరీ వెంకటేష్ చాలా గ్యాప్ తర్వాత లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'సైంధవ్'. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్ పై వెంకట్‌ బోయనపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో నవాజుద్దీన్ సిద్దిఖీతో పాటుగా శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదొక పాన్ ఇండియా మూవీ. తెలుగుతో పాటుగా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదలవుతుంది. డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 


హరోం హర:


నైట్రో స్టార్ సుధీర్‌ బాబు హీరోగా రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్‌’ అనేది దీనికి ట్యాగ్‌లైన్‌. 'సెహరి' ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఆ మధ్య టైటిల్ టీజర్ రిలీజ్ చేసిన నిర్మాతలు.. డిసెంబర్‌ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసారు.  


Also Read: 'ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు కరణ్ సిగ్గుపడాలి.. సౌత్ హీరోలను చూసి నేర్చుకో రణ్‌వీర్‌'


డుంకీ:


'జవాన్' తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నుంచి రాబోతున్న సినిమా 'డుంకీ'. ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీరి కాంబోలో రూపొందుతున్న ఫస్ట్ మూవీ ఇది. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరానీ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అయితే రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. 


ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్:


యూత్ స్టార్ నితిన్ - శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. దర్శక రచయిత వక్కంతం వంశీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్ పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా.. టైటిల్ అండ్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఈ మధ్యే ప్రకటించారు. డిసెంబర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. 


గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి:


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. లిరిక్ రైటర్ కృష్ణచైతన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోమవారం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. 2023 డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ని మాత్రం వెల్లడించలేదు. 


ఆక్వామాన్:


ఇలా డిసెంబర్ నెలలో అనేక క్రేజీ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. క్రిస్మస్ సీజన్ లోనే 5కు పైగా సినిమాలు రాబోతున్నాయి. వీటికి పోటీగా 'ఆక్వామాన్' వంటి హాలీవుడ్ మూవీ కూడా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'OG' సినిమాని కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేస్తారని అంటున్నారు కానీ, వాయిదా పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ ఏడాది చివర్లో వచ్చే సినిమాల్లో ఏవేవి బ్లాక్ బస్టర్స్ గా నిలిచి, 2023 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలుకుతాయో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read: 'బ్రో' ఎఫెక్ట్ - 'భోళా శంకర్' విషయంలో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial