ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు (Who Is AP CM)? వైఎస్ జగన్ మోహన్ రెడ్డి! అయితే... అందాల భామ ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) మాత్రం జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అనుకుంటున్నారు. ఆ విధంగా అనుకోవడమే కాదు... ట్వీట్ కూడా చేశారు. 


సీఎంతో స్క్రీన్ షేర్ చేసుకోవడం...
పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన సినిమా 'బ్రో'. ఇందులో ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'మై డియర్ మార్కండేయ...' పాటలో ఆమె సందడి చేయనున్నారు. మరికొన్ని గంటల్లో  (ఈ శుక్రవారం, జూలై 28న) సినిమా విడుదల సందర్భంగా ఊర్వశి ఓ ట్వీట్ చేశారు. 


''ప్రపంచ వ్యాప్తంగా జూలై 28న విడుదల అవుతోన్న 'బ్రో ది అవతార్' సినిమాలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అహంకారపూరితంగా నడుచుకునే ఓ యువకుడికి మరణించిన తర్వాత అవకాశం వస్తే... తన తప్పుల్ని ఎలా సరి చేసుకున్నాడు? అనేది సినిమా కథ. థియేటర్లలో కలుద్దాం'' అని ఊర్వశి రౌతేలా ట్వీట్ చేశారు. ప్రీ రిలీజ్ వేడుకలో పవన్, సాయిలతో దిగిన ఫోటో షేర్ చేశారు. 




ఊర్వశి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ''పాప ట్వీట్ ఇలాగే ఉంచు 2024 తర్వాత మాట్లాడుకుందాం'' అని ఒకరు కామెంట్ చేయగా... మరొకరు ''ఊర్వశికి అసలు విషయం తెలియదా?'' కామెంట్ చేశారు. 


అభిమానులు సీయం సీయం అని అరిస్తే...
'బ్రో' ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు, అంతకు ముందు ప్రముఖ నిర్మాత ఏయం రత్నం, హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతున్న సమయాల్లోనూ అభిమానులు 'సీయం సీయం' అని అరిచారు. ఆ అరుపులు విని నిజంగా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నట్లు ఉన్నారు ఊర్వశి రౌతేలా. ఆమె ట్వీట్ సినీ ప్రేక్షకుల మధ్య మాత్రమే కాదు, రాజకీయ పార్టీల అభిమానుల మధ్య చర్చకు కారణం అవుతోంది. 


Also Read : నన్ను వదిలేయండి, ప్రభాస్ మీద కామెంట్ చేయలేదు - 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు



పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో తొలి చిత్రమిది. మావయ్యతో కలిసి నటించే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తేజ్. ఇందులో తనది గెస్ట్ రోల్ కాదని, 80 పర్సెంట్ సినిమాలో ఉంటానని పవన్ తెలిపారు.  


'బ్రో' సినిమాకు సముద్రఖని దర్శకుడు. ఆయన తీసిన తమిళ హిట్ 'వినోదయ సీతం' ఆధారంగా రూపొందిన చిత్రమిది. అయితే... తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని, తెలుగు నేటివిటీకి తగ్గట్లు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. తమన్ సంగీత దర్శకుడు. సాయి తేజ్ జోడీగా కేతికా శర్మ, కీలక పాత్రలో ప్రియా ప్రకాష్ వారియర్ నటించారు. 'మై డియర్ మార్కండేయ' పాటలో ఊర్వశి రౌతేలా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు.


Also Read రూ. 150 కోట్ల షేర్ గ్యారెంటీ 'బ్రో'... పవన్ కళ్యాణ్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ ఎంతంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial