రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'బేబీ'. సాయి రాజేశ్‌ దర్శకత్వం వహించిన ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీతో వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అవుతోంది. ఇందులో విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాటలు సంగీత ప్రియులను విశేషంగా అలరించాయి. ఈ క్రమంలో చిత్ర బృందం తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేసారు. 


'మొదటి ప్రేమకు మరణం లేదు, మనసు పొరల్లో శాశ్వితంగా సమాధి చేయబడి ఉంటుంది' అనే లైన్ తో వచ్చిన 'బేబీ' ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 'అర్జున్ రెడ్డి' మాదిరిగా ప్రేమలో విఫలమైన యువకుడిగా దేవదాస్ అవతార్ లో ఆనంద్ దేవరకొండ ఎంట్రీ ఇవ్వడంతో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో స్కూల్ డేస్ లో ఆనంద్, వైష్ణవీల మధ్య ప్రేమ కథను చూపిస్తుంది. అయితే ఆటో డ్రైవర్ అయిన ఆనంద్ ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వైష్ణవి.. కాలేజీకి వెళ్లిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. 


కాలేజీలో వైష్ణవి మరో అబ్బాయితో స్నేహం చేయడం, ఆనంద్ ను దూరం పెడుతుండటం, ఇద్దరు హీరోలు వైష్ణవిని కోరుకోవడం, ఈ క్రమంలో మూడు ప్రధాన పాత్రల మధ్య సంఘర్షణ వంటివి ట్రైలర్ లో మనం చూడొచ్చు. 'ప్రతీ కష్టానికి ముందు దేవుడు ఏదొక సిగ్నల్ ఇస్తాడు.. అమ్మాయి జీవితంలోకి వచ్చినప్పుడు అసలు సిగ్నల్ ఎందుకు ఇవ్వడు?' అంటూ ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. అబ్బాయిలను తిరిగి కొట్టేంత బలం లేకపోయినా, గుండెల మీద కొట్టాలంటే అమ్మాయిల కంటే గట్టిగా కొట్టేవాడు ఎవడూ ఉండడు అనే అర్థంలో హీరోయిన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. 



నేటి తరం యువతీ యువకుల భావాలకు అద్దం పట్టేలా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా 'బేబీ' సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. చివరకు వైష్ణవి ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తుంది? ఆనంద్, వైష్ణవిల ప్రేమ కథకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అనే అంశాలు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఒక్కసారి బడి దాటాక మన ఫిగర్స్ మనవి కాదు, అమ్మాయిలంతా ఒకటే అనే అర్థంలో చెప్పే సంభాషణలు యూత్ ని ఆకట్టుకుంటాయి. 


Also Read: Project-K: ఐడల్ ప్రభాస్‌తో కలసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను - అమితాబ్ బచ్చన్ 


ఓవరాల్ గా యూత్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న 'బేబీ' చిత్రం ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. నేషనల్ అవార్డు అందుకున్న 'కలర్ ఫోటో' సినిమాకి కథ అందించిన సాయి రాజేష్.. ఈసారి హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీతో వచ్చాడని చెప్పాలి. ఇందులో ప్రేమించిన అమ్మాయి కోసం పరితమించే ట్రూ లవర్ గా ఆనంద్ దేవరకొండ చాలా బాగా నటించాడు. 'సాఫ్ట్ వేర్ డెవలపర్' వంటి యూట్యూబ్ సిరీస్ లతో పాపులర్ అయిన వైష్ణవి చైతన్య.. డెబ్యూతోనే అందరినీ ఆకట్టుకుంది. ఓవైపు డీగ్లామర్ గా కనిపిస్తూనే, మరోవైపు గ్లామరస్ గా అందంగా కనిపించింది. ట్రైలర్ లో విజయ్ బుల్గేని సమకూర్చిన మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎమ్ ఎన్ బాల్ రెడ్డి దీనికి సినిమాటోగ్రాఫర్ గా, విప్లవ్ ఎడిటర్ గా వర్క్ చేసారు. 


'బేబీ' మూవీని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ప్రేమకథా చిత్రాన్ని జూలై 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. అంతకంటే ప్రేక్షకుల కోసం ముందుగా జులై 13న పలు థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. చాలా కాలంగా సరైన హిట్ కోసం కష్టపడుతున్న ఆనంద్ దేవరకొండ, ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial