రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ప్రాజెక్ట్‌-కె’ (Project K). ఇందులో లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లతో పాటుగా దీపికా పదుకునే, దిశా పటానీ వంటి బాలీవుడ్ భామలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో స్టార్ కాస్టింగ్ తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాటిని రెట్టింపు చేసేలా మేకర్స్ తాజాగా బిగ్ అప్డేట్ తో వచ్చారు. ‘ప్రాజెక్ట్‌-K’ ప్రతిష్ఠాత్మకమైన ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ ఈవెంట్లో సినిమా పాల్గొననున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అమితాబ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.


'శాన్ డియాగో కామిక్ కాన్' ఈవెంట్లో పాల్గొననుండటం పట్ల అమితాబ్ బచ్చన్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఇది తనకు ఎంతో గర్వించదగ్గ విషయం అన్నారు. ఇన్ని రోజులు ఈ సినిమా ఇంత పెద్దది, ఇంత ముఖ్యమైనదని నేను గ్రహించకపోయాను. ఇప్పుడు నాకు తెలిసింది. వైజయంతి మూవీస్, డైరెక్టర్ నాగ్ సర్ కి, మొత్తం యూనిట్ కి నా మీద చూపించిన ప్రేమకు చాలా ధన్యవాదాలు. ఇంత గొప్ప సినిమాలో నేను భాగం అవ్వడం మర్చిపోలేని అనుభవం అని బిగ్ బి తన ట్వీట్ లో పేర్కొన్నారు.






ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ.. "తెలుగు సినిమా 'ప్రాజెక్ట్ కె'లో, ఇలాంటి గొప్ప సంస్థలో భాగమైనందుకు.. ఐడల్ ప్రభాస్ ఉన్న ఫ్రేమ్ లో నేను ఉండటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నేను ధన్యుడిని అని మాత్రమే చెప్పగలను. ప్రభాస్ నా పట్ల చూపిన శ్రద్ధ, వారి వినయం, వారి గౌరవం నన్ను ఎమోషనల్ గా టచ్ చేశాయి. అందరికీ ధన్యవాదాలు. నాగి సార్ కి థ్యాంక్స్. 'ప్రాజెక్ట్ K'లో భాగమైన వారందరూ మరింత ఎత్తుకు ఎదగాలని ప్రార్థిస్తున్నాను" అని అమితాబ్ బచ్చన్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.






అమెరికాలో జులై 20 నుంచి 23 వరకు జరగనున్న శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్‌ లో ‘ప్రాజెక్ట్‌-కె’ చిత్ర బృందమంతా పాల్గొననుంది. దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్‌, దీపికా పదుకొణె, కమల్‌ హాసన్‌ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అంతర్జాతీయ స్ధాయిలో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఈవెంట్‌ కు హాజరుకానున్న తొలి భారతీయ సినిమాగా ‘ప్రాజెక్ట్‌-కె’ రికార్డు సృష్టించనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్‌ ఓ స్పెషల్ పోస్టర్ పోస్టర్‌ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. 


Also Read: Gangster Movies: ప్రభాస్ to పవన్ కల్యాణ్, బాక్సాఫీస్ దండయాత్రకు రెడీ అవుతున్న గ్యాంగ్‌స్టర్స్!


ఇక అదే వేదికపై ఈ మూవీ ట్రైలర్‌, రిలీజ్‌ డేట్‌ ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇండియా గొప్ప కథలకు, సినిమాలకు నిలయం. మా సినిమాతో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రపంచ ప్రేక్షకులకు ‘ప్రాజెక్ట్‌-K’ కథను పరిచయం చేయడానికి శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌ ఈవెంట్‌ సరైన వేదిక అని మేమంతా భావిస్తున్నాం’’ అని అన్నారు.


కాగా, మోడరన్ విష్ణు అవతారంగా ఫిక్షనల్ సోషియో ఫాంటసీ సూపర్ హీరో మూవీగా ప్రాజెక్ట్ K తెరకెక్కుతుంది.  వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీని కోసం దాదాపు 600 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైతే అత్యధిక బడ్జెట్ తో తీస్తున్న భారతీయ సినిమా ఇదే అని చెప్పాలి. ఈ పాన్ వరల్డ్ చిత్రాన్ని పలు అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial