Ambajipeta Marriage Band Promotions: యూట్యూబ్ నుంచి వచ్చి వెండితెరపై హీరోగా మారాడు సుహాస్. హీరో అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అనే అంచనాలను బ్రేక్ చేసి కేవలం తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇక సుహాస్ హీరోగా ఇప్పటికే రెండు సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా తను హీరోగా తెరకెక్కిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలేజ్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వడం కోసం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ టీమ్.. ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. తాజాగా అందులో భాగంగానే ఊరు మొత్తానికి విందు ఏర్పాటు చేయనుంది.


ఊరి ప్రజల కోసం..


‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’తో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు దుశ్యంత్. ఇంత మంచి విలేజ్ డ్రామాలో సోషల్ మెసేజ్‌లు కలిపి సినిమాను బాగా తెరకెక్కించాడని దుశ్యంత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రేక్షకులు. సుహాస్‌తో పాటు తన అక్కగా నటించిన శరణ్య ప్రదీప్, హీరోయిన్‌గా నటించిన శివానీ పర్ఫార్మెన్స్‌లు కూడా బాగున్నాయని పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. అయితే ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ కోసం అమలాపురంలోని లూటుకుర్రు అనే చిన్న గ్రామంలో సెట్‌ వేశారు. సినిమాలోని చాలా భాగం అక్కడే చిత్రీకరించారు. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మూవీ టీమ్.. అందులో భాగంగానే ఆ ఊరు కోసం ప్రత్యేకంగా ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నారు. 


మళ్లీ ఆ ఊరికే..


లూటుకుర్రులోనే స్ట్రీట్ సెట్, బ్యాండ్ ఆఫీస్ సెట్, సెలూన్ షాప్ సెట్ ఏర్పాటు చేసి దాదాపు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా మొత్తం అక్కడే చిత్రీకరించాడు దర్శకుడు. దీంతో ఆ ఊరి ప్రజలంతా షూటింగ్‌కు చాలా సాయం చేశారని చెప్పుకొచ్చాడు. అందుకే ఊరి ప్రజలందరికీ ఘనంగా విందు ఏర్పాటు చేయాలని నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందులో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ టీమ్ మొత్తం పాల్గొనున్నట్టు తెలుస్తోంది. మామూలుగా సినిమా షూటింగ్స్ కోసం ఇలాంటి పల్లెటూళ్లను ఎంపిక చేసుకుంటారు మేకర్స్. కానీ షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్లీ ఆ ఊళ్లకు తిరిగి వెళ్లడం అనేది జరగదు. కానీ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ టీమ్ మాత్రం తాము షూటింగ్ చేసిన ఊరి ప్రజల కోసం లంచ్ ఏర్పాటు చేయడం మంచి విషయమని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.


హ్యాట్రిక్ హిట్..


ముందుగా యూట్యూబ్‌లోని వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్‌తో ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు సుహాస్. ఆ తర్వాత సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు తనకు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ‘కలర్ ఫోటో’లో లీడ్ రోల్‌లో నటించే అవకాశం దక్కింది. కోవిడ్ సమయంలో విడుదల అవ్వడంతో నేరుగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయినా కూడా ‘కలర్ ఫోటో’కు ఎనలేని ఆదరణ లభించింది. ఇక తను హీరోగా నటించిన రెండో సినిమా ‘రైటర్ పద్మభూషణ్’ సరిగ్గా ఏడాది ముందు థియేటర్లలో విడుదలయ్యి క్లీన్ హిట్‌ను సాధించింది. ఇప్పుడు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’తో తన ఖాతాలో హ్యాట్రిక్ హిట్‌ను వేసుకున్నాడు సుహాస్.


Also Read: ‘హనుమాన్’ మరో రికార్డ్ - స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన ప్రశాంత్ వర్మ