Director Surya Kiran - Kalyani Divorce: సౌత్‌లో దర్శకుడిగా గుర్తింపు దక్కించుకున్న సూర్య కిరణ్.. తాజాగా పచ్చ కామెర్లతో కన్నుమూశారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పటల్‌లో ఆయన మరణించారు. దీంతో అసలు సూర్య కిరణ్ ఎవరో తెలియని వారు తన గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. సూర్య కిరణ్ ఒక నటిని పెళ్లి చేసుకొని.. కొన్నేళ్ల తర్వాత విడాకులు ఇచ్చారు. అప్పట్లో సోషల్ మీడియా అనేది లేకపోవడం వల్ల సూర్య కిరణ్ పర్సనల్ లైఫ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదు. ఆయన మరణించిన తర్వాత పర్సనల్ లైఫ్ విషయాల గురించి తెలుసుకొని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.


వివాహం.. విడాకులు..


సూర్య కిరణ్ పెళ్లి చేసుకుంది మరెవరినో కాదు.. హీరోయిన్ కళ్యాణినే. కళ్యాణి.. ఎన్నో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యింది. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఆమె పలు చిత్రాలను నిర్మించింది. 2022లో విడుదలయిన ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రానికి ఉత్తమ నటిగా కళ్యాణికి నంది అవార్డ్ కూడా దక్కింది. చాలామంది అసలు కళ్యాణి ఇంకా పెళ్లే చేసుకోలేదని అనుకుంటూ ఉంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు.. దర్శకుడు సూర్య కిరణ్‌తో కళ్యాణికి వివాహం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అసలు వాళ్లు ఎందుకు విడిపోయారు అనే విషయాన్ని సుజిత బయటపెట్టారు. సీరియల్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సుజిత.. మరెవరో కాదు.. సూర్య కిరణ్‌ చెల్లెలు.


అదే కారణం..


తమ విడాకుల గురించి కళ్యాణి, సూర్య కిరణ్ ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడలేదు. కానీ వీరిద్దరి మధ్య విడాకులకు దారితీసిన కారణం గురించి ఒక ఇంటర్వ్యూలో సుజిత బయటపెట్టింది. ఆర్థిక సమస్యలే వారి విడాకులకు కారణమని తెలిపింది. దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత తెలుగులో ‘సత్యం’లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు సూర్య కిరణ్. కానీ ఆ తర్వాత తను డైరెక్ట్ చేసిన సినిమాలు ఏవీ పెద్దగా విజయం సాధించలేదు. దాంతో పాటు ఇండస్ట్రీలో పోటీ కూడా ఎక్కువ అవ్వడంతో సూర్య కిరణ్‌కు అవకాశాలు కూడా రాలేదు. అలా ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఇక నటిగా కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన కళ్యాణి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి రీఎంట్రీ ఇచ్చింది.


చైల్డ్ ఆర్టిస్ట్‌గా..


‘టాక్సీవాలా’, ‘యాత్ర’ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించింది కళ్యాణి. నిర్మాతగా పలు చిత్రాలను తెరకెక్కించిన తర్వాత ఇప్పుడు డైరెక్షన్‌లోకి కూడా అడుగుపెట్టింది. తను డైరెక్ట్ చేస్తున్న మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. కేరళలోని కవుంభగోమ్, తిరువళ్లలో పుట్టింది కళ్యాణి. తన తండ్రి మురళీధరన్.. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ కార్పొరేషన్‌లో ఉద్యోగిగా పనిచేసేవారు. హీరోయిన్‌గా కళ్యాణి కెరీర్.. ఒక్కసారిగా ఏమీ మొదలుకాలేదు. చిన్నప్పటి నుండే మలయాళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకుంది కళ్యాణి. దాని తర్వాత సైడ్ ఆర్టిస్ట్‌గా మారింది. అలా మెల్లగా తనకు హీరోయిన్‌గా అవకాశాలు రావడం మొదలయ్యింది. 


Also Read: ఆ డైరెక్టర్‌ నన్ను అలా అడిగే సరికి షాక్ అయ్యా: సీరియల్ నటి చైత్రా రాయ్