మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోగా మారారు. ఇటీవలే కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాను పూర్తి చేశారు. ప్రస్తుతం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో డీటాక్సినేషన్ తీట్మెంట్ కోసం వైజాగ్ కు వెళ్లారు. తిరిగిరాగానే 'లూసిఫర్' రీమేక్ షూటింగ్ లో పాల్గొనున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. 

 

ఇప్పటికే తమన్ తో కలిసి మోహన్ రాజా కొన్ని మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నయనతారను కీలకపాత్ర కోసం ఎంపిక చేసుకున్నారని సమాచారం. అలానే యంగ్ హీరో సత్యదేవ్ ను కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. మలయాళంలో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రలో సత్యదేవ్ కనిపిస్తారని టాక్. సినిమాలో మరికొంతమంది టాలెంటెడ్ యాక్టర్స్ ను తీసుకోబోతున్నారు. 

 

ఇదిలా ఉండగా.. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఈ సినిమా కోసం సంప్రదించినట్లు సమాచారం. మెగా ఫ్యామిలీకు, సల్మాన్ ఖాన్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పుడప్పుడు ఈ రెండు ఫ్యామిలీలు కలుసుకుంటూ ఉంటారు. రామ్ చరణ్ కి సల్మాన్ ఖాన్ మంచి ఫ్రెండ్. ఈ అనుబంధంతోనే ఇప్పుడు చిరు.. సల్మాన్ ఖాన్ ను తన సినిమాలో  పాత్ర కోసం అడగాలనుకుంటున్నారు. 

 

మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర కోసం సల్మాన్ ఖాన్ ను అడుగుతున్నారు. ఈ పాత్ర చిన్నదే అయినా.. కథకు కీలకం కావడంతో ఎవరైనా పాపులర్ లేదా టాప్ హీరో చేస్తే మంచి బజ్ వస్తుంది. అందుకే ఈ పాత్రను చేయమని సల్మాన్ ఖాన్ ను చిరు స్వయంగా అడగబోతున్నారట. ఈ నెల 13 లోపు సల్మాన్ ఖాన్ నటిస్తారా..? లేదా..? అనే విషయంలో క్లారిటీ వస్తుంది. సల్మాన్ ఖాన్ గనుక ఒప్పుకుంటే ఈ సినిమాకి పాన్ ఇండియా లుక్ రావడం ఖాయం.