సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 'అతడు', 'ఖలేజా' లాంటి సినిమాలు వచ్చాయి. 'అతడు' సినిమా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన 'ఖలేజా' సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడనప్పటికీ.. టీవీల్లో మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికీ 'ఖలేజా' సినిమా టీవీలో వస్తుందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఈ సినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ మాములుగా ఉండదు మరి. 


మళ్లీ ఇంతకాలానికి వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. నిన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్ అంతా పని చేయనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్, ఎడిటర్ గా నవీన్ నూలి, సినిమాటోగ్రాఫర్ గా మది లాంటి స్టార్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డేను తీసుకున్నారు. 


Also Read: Mahesh Babu Movie Update: మహేష్ కు త్రివిక్రమ్ గిఫ్ట్ ఇదే.. సూపర్ స్క్వాడ్ వచ్చేసింది..


దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఎలాంటి జోనర్ లో రూపొందించనున్నారు..? సినిమా ఎలా వుండబోతుందనే విషయాలపై క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకు మహేష్ బాబు పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలు చేయలేదు. తన తోటి హీరోలంతా పాన్ ఇండియా కథలతో దూసుకుపోతుంటే మహేష్ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితమయ్యారు. మొన్నామధ్య 'స్పైడర్' సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. 


అయితే త్రివిక్రమ్ సినిమాతో మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారని తెలుస్తోంది. నిజానికి రాజమౌళితో చేయబోయే సినిమాతో మహేష్ పాన్ ఇండియా మార్కెట్ లోకి వస్తారనుకున్నారు. కానీ ఇప్పుడు రాజమౌళి కంటే ముందుగానే త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాను భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నారు. 'అతడు', 'ఖలేజా' కంటే ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నిన్న ట్విట్టర్ స్పేస్ లోకి వచ్చిన చిత్రనిర్మాత తెలిపారు. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి వచ్చే ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు మళ్లీ ట్విట్టర్ స్పేస్ లోకి వస్తామని ఆయన చెప్పడంతో అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. 


ఇప్పటివరకు త్రివిక్రమ్ తన సినిమాల్లో యాక్షన్, వినోదం రెండూ ఉండేలా చూసుకుంటున్నారు. కానీ ఈసారి పూర్తి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో మరి. ప్రస్తుతానికి మహేష్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.