గత వారం.. శోభాశెట్టి, ప్రియాంకలు చేసిన నామినేషన్లు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయనే సంగతి తెలిసిందే. అయితే, ఈ వారం మాత్రం తప్పకుండా అమర్, పల్లవి ప్రశాంత్‌లు వారి రికార్డులు బద్దలకొట్టే అవకాశం ఉంది. అలాగే, గౌతమ్, పల్లవి ప్రశాంత్‌ల నామినేషన్స్ వాదనలు కూడా చాలా సేపు జరిగాయి. అయితే, వారి నామినేషన్స్ చర్చను సోమవారం ఎపిసోడ్‌లో టెలికాస్ట్ చెయ్యలేదు. మంగళవారం ఎపిసోడ్ చూసేవారికి తప్పకుండా అమర్-ప్రశాంత్‌ల నామినేషన్స్ తలనొప్పి పెంచే అవకాశాలున్నాయి. అర్థం లేని ఒక పాయింట్ చుట్టూ ఇరువురు జరిపిన వాదనలు.. ఒకరి పాయింట్ మరొకరికి అర్థంకాకుండా జరుపుకున్న వాదనలు తప్పకుండా విసుగు తెప్పిస్తాయి. ఇంకో విషయం ఏమిటంటే.. నామినేషన్స్‌లో ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోలేక అమర్ దీప్ కూర్చొని బలంగా తన్నాడు. మరో విశేషం ఏమిటంటే.. ఈ ఆదివారం హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన రతికాను ఎవరూ నామినేట్ చెయ్యకూడదని ‘బిగ్ బాస్’ తెలిపాడు. మరి, ఆమె ఎవరికి వేసిందో తెలుసా?


గౌతమ్‌తో అర్థంలేని వాదన


పల్లవి ప్రశాంత్ గౌతమ్‌ను నామినేట్ చేస్తూ.. అర్థం లేదని వాదన చేశాడేమో అని ప్రేక్షకులకు అనిపించక తప్పదు. ఎంత శివాజీకి సపోర్ట్‌గా ఉన్నా.. మరీ అంతా విశ్వాసం చూపించాల్సిన అవసరం లేదేమో అని ప్రేక్షకులకు అనిపించినా ఆశ్చర్యపోవక్కర్లేదు. తనకంటూ సొంత అభిప్రాయం లేకుండా శివాజీ, భోలేలపై ఈగ వాలకుండా చూడటమే తన బాధ్యత అన్నట్లుగా ప్రశాంత్ ఉన్నాడనిపిస్తోంది. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఎత్తుతూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు ప్రశాంత. ‘‘నువ్వు వేసిన నామినేషన్స్ సిల్లీగా అనిపించాయి. మనిషికి నరాలు ఎక్కడ ఉంటాయో తెలుస్తాయా? అన్నాడు ప్రశాంత్. ఆ రోజు తేజా మెడకు బెల్ట్ వేసినప్పుడు నీ నరాలకు తగులతాయని అన్న(శివాజీ)కి ఎలా తెలుస్తాయి. ఆ రోజు తేజా కొడుతున్నప్పుడు ఆపు అని చెప్పాలి’’ అన్నాడు. దీంతో వారు ఏ ఇంటెన్షన్‌తో చేస్తున్నారో ఎలా తెలుస్తుందని గౌతమ్ తిరిగి ప్రశ్నించాడు. ‘‘ఆ విషయంపై నాగ్ సార్ కూడా తేజా, సందీప్, శివాజీ‌లకు ఆ విషయం మీ ఇచ్చిపడేశాడు. అది సిల్లీ ఎలా అవుతుంది. ఒక మనిషి ప్రాణం మీదకు వస్తే అది సిల్లీ పాయింట్ ఎలా అవుతుంది?’’ అని గౌతమ్ వాదించాడు. ‘‘నేను తేజాకు బెల్ట్ వేయక ముందే శివాజీ అడ్డుకున్నారు. అది నాకు ద్వంద వైఖరిగా అనిపించింది’’ అన్నాడు. ‘‘పులి బిడ్డను ఇంకోసారి నామినేషన్స్ వేస్తే నరికి పారేస్తా.. అనే డైలాగ్ వేసి తొడలు కొట్టడం నాకు కూడా వచ్చు. మూసుకొని నామినేషన్ వేసుకో మచ్చా’’ అని గౌతమ్ కామెంట్ చేశాడు. ఆతర్వాత పల్లవి ప్రశాంత్ కూడా రెచ్చిపోతూ ఎగిరెగిరి రెండు తొడలు కొట్టి గౌతమ్‌కు సవాల్ చేశాడు. అయితే, వారి వాదన చాలా సేపు సాగింది. ఇక విధంగా లైవ్‌లో నామినేషన్స్ చూసేవారికి తప్పకుండా వారి వాదన విసుగుతెప్పించి ఉండొచ్చు. 


సుదీర్ఘంగా అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్‌ల వాదన 


ఆ తర్వాత అమర్‌దీప్‌ను నామినేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. ‘‘భోలే మా గ్రూపులో ఆడాడు. గ్రూప్ నిర్ణయం ప్రకారం అతడు గేమ్ ఆడలేదు. అలాగే శివాజీ అన్న కోసం తన కంటెండర్‌షిప్‌ను త్యాగం చేశాడు. అలాంటివారిని నువ్వు ఎందుకు నామినేట్ చేశావు? అలాగే భోలే త్యాగంతో కంటెండర్‌‌షిప్ సాధించిన శివాజీకి సపోర్ట్ చేయకుండా ఆయన ఫొటోను స్విమ్మింగ్ పూల్‌లో ఎందుకు పడేశావంటూ.. భోలే, శివాజీలకు సపోర్టుగా మాట్లాడుతూ అమర్‌దీప్‌ను నామినేట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే, అమర్‌దీప్.. కరెక్ట్ పాయింట్ చెప్పాలని, వారి గురించి నన్ను నామినేట్ చేయడం ఏమిటంటూ వాదన మొదలుపెట్టాడు. దీంతో ఇద్దరూ చాలా సేపు వాదించుకున్నారు. మధ్యలో గౌతమ్, ప్రియాంకలు అమర్‌దీప్‌కు సపోర్టుగా మాట్లాడారు. మరోవైపు భోలే, శివాజీలు పల్లవి ప్రశాంత్‌లకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. మొత్తానికి అది రెండు గ్రూపుల మధ్య నామినేషన్స్‌గా మారింది. పల్లవి ప్రశాంత్‌తో వాదిస్తున్నప్పుడు భోలే మధ్యలో మాట్లాడటంతో ఆగ్రహానికి గురైన అమర్‌దీప్ కూర్చొని బలంగా తన్నేశాడు. చివరికి గంట సేపు వాదించుకున్న తర్వాత పల్లవి ప్రశాంత్.. అమర్‌దీప్‌ను నామినేట్ చేశాడు. 


రీఎంట్రికి ఓటేసిన అమర్‌దీప్‌నే నామినేట్ చేసిన రతిక


హౌస్ నుంచి ఎలిమినేటైన కంటెస్టెంట్లు శుభశ్రీ, శోభా, రతికాల్లో ఒకరికి రీ-ఎంట్రీ ఇచ్చేందుకు బిగ్ బాస్ పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలని బిగ్ బాస్ చెప్పడంతో ఎవరూ బయట మాట్లాడలేదు. అయితే, అతి తక్కువ ఓట్లతో రతిక ఆదివారం హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సందర్భంగా అమర్‌దీప్.. ఆమెకు ఓట్లు వేసిన కంటెస్టెంట్ల గురించి మాట్లాడినట్లు సోమవారం ఎపిసోడ్‌లో చూపించారు. అయితే, అమర్‌దీప్.. రతికాకు తాను ఓటేసినట్లు నేరుగా చెప్పకుండా.. ఆమె చేతిలో వేలుపెట్టి.. నీకు నేనే ఓటు వేశాను అని చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ విషయం రతికాకు అర్థమైందో లేదోగానీ.. నామినేషన్స్‌లో మాత్రం రతికా.. అమర్‌దీప్‌ ఫొటోను కాల్చి నామినేట్ చేసింది. దీంతో అమర్‌దీప్‌కు నోటమాట రాలేదు. నేరుగా వెళ్లి రతికాకు హగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అసలు విషయం చెప్పి వాపోయాడు. అంతకు ముందు రతిక శోభాశెట్టిని నామినేట్ చేసింది. తాను హౌస్‌లో ఉన్నప్పుడు జరిగిన టాస్క్‌లో కాయిన్స్ పంపకంపై సమయంలో జరిగిన శోభాశెట్టి చేసింది నచ్చలేదంటూ ఆమెను నామినేట్ చేసింది. 


Also Read: రతికాకు ఓట్లు వేసింది ఆ ముగ్గురే, సీక్రెట్ బయటపెట్టేసిన గౌతమ్