‘బిగ్ బాస్’ హౌస్‌లోకి రతిక రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హౌస్‌లోకి తిరిగి వచ్చేందుకు సుభశ్రీ, దామిని, రతికాల్లో ఒకరికి ఓటు వేయాలని రెండు వారాల కిందట హోస్ట్ అక్కినేని నాగార్జున హౌస్‌మేట్స్‌ను కోరిన సంగతి తెలిసిందే. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా హౌస్‌మేట్స్ ఆ ముగ్గురికి ఓటు వేశారు. అయితే, ఈ ఓటింగ్‌పై బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వారినే ఇంట్లోకి పంపిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో అతి తక్కువ ఓట్లు వచ్చిన రతికా ఆదివారం హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. 


ఇంతకీ రతికాకు ఓటేసింది ఎవరు? 


వాస్తవానికి హౌస్‌లో రతికాతో ఎవరికీ పెద్దగా బాండ్ లేదు. పాజిటివ్‌గా ఉన్న శివాజీ, ప్రశాంత్, యావర్‌లను కూడా రతిక దూరం చేసుకుంది. దీంతో అసలు ఆమెకు ఎవరైనా ఓటు వేసి ఉంటారా? వేస్తే.. ఎవరు వేసి ఉంటారని ప్రేక్షకుల్లో సందేహాం ఉంది. ఎందుకంటే.. అత్యధిక హౌస్‌మేట్స్‌కు సుభశ్రీ, దామిని అంటేనే ఎక్కువ ఇష్టం. వారిద్దరు హౌస్‌లో అందరితో బాగానే ఉండేవారు. ముఖ్యంగా సుభశ్రీ చాలా పాజిటివ్‌గా ఉండేది. ఇక దామిని కిచెన్‌లోనే ఉంటూ.. వంటలక్కలా పనిచేసేది. ఈ నేపథ్యంలో హౌస్‌మేట్స్ ఆమెకు కూడా ఓటు వేసి ఉంటారని ప్రేక్షకులు అనుకున్నారు. 


సీక్రెట్ ఓటింగ్‌ను బయటపెట్టేసిన గౌతమ్


రతిక ఇంట్లోకి రాగానే.. గౌతమ్ ఆమెతో మాట్లాడాడు. ‘‘నీకు ఎవరు ఓటేశారు? ఎవరు వేయలేదో చెప్పారా?’’ అని గౌతమ్ అడిగాడు. ఇందుకు రతిక.. చెప్పలేదని సమాధానం ఇచ్చింది. దీంతో గౌతమ్ అసలు విషయం చెప్పేశాడు. హౌస్‌లో అంతా వారిద్దరికే ఓటింగ్ వేశారని, తాను కూడా సుభశ్రీకి ఓటేసనని చెప్పాడు. సుభశ్రీ తన కోసం లెటర్ త్యాగం చేసిందని, అందుకే.. తనకు ఓటేసి వెనక్కి తీసుకురావాలని అనుకున్నానని గౌతమ్ అన్నాడు. రతికా ఆ విషయంపై పాజిటివ్‌గానే స్పందించింది. ఆ తర్వాత గౌతమ్.. శోభాశెట్టి, అర్జున్, సందీప్‌, ప్రియాంకలతో మాట్లాడుతూ.. ‘‘రతికాకు ఎవరు ఓటు వేశారనేది ఇంకా చూపించలేదు. నేను సుభా (సుభశ్రీ)కు వేశాను. ఆమె నా కోసం లెటర్ త్యాగం చేసిందని, అందుకే వేశానని రతికాకు చెప్పా’’ అని వారికి తెలిపాడు. రతికాకు ముగ్గురు మాత్రమే ఓటేశారని పేర్కొన్నాడు. టేస్టీ తేజా, అమర్‌దీప్, అర్జున్ ఓటేసినట్లు తెలిసిందని గౌతమ్ అన్నాడు. మొత్తానికి ఓటింగ్ సీక్రెట్‌ను గౌతమ్ బయటపెట్టేశాడు. మరి ఆమెకు ఎవరు ఓటేశారనేది బిగ్ బాస్ నేరుగా చెబుతాడో లేదో చూడాలి.


శివాజీ కాళ్లకు మొక్కిన రతిక - పట్టించుకోని పల్లవి ప్రశాంత్


రతిక రోజ్ హౌస్‌లోకి వచ్చినా.. పల్లవి ప్రశాంత్ ఎలా స్పందిస్తాడని ప్రేక్షకులు ఎదురు చూశారు. అయితే, అతడు అస్సలు పట్టించుకోలేదు. ఆ తర్వాత హాల్‌లో రతిక అందరితో కలిసి మళ్లోచ్చా అని ప్రశాంత్‌ను చూసి పలకరించే ప్రయత్నం చేసింది. కానీ, రైతు బిడ్డ ఆమెను లైట్ తీసుకున్నాడు. ఆ తర్వాత రతిక రూమ్‌లో శివాజీ కాళ్లు పట్టుకుని.. క్షమాపణలు కోరింది. ‘‘నాకు తెలీదు చెప్పినావ్, ఇంకోసారి అలాంటివి చేయను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎలిమినేట్ కాగానే మాట్లాడలేకపోయా. ఏడుపు వచ్చేసింది. అదృష్టంగా భావిస్తున్నా’’ అని రతిక తెలిపింది. దీంతో శివాజీ స్పందిస్తూ.. ‘‘జాగ్రత్తగా ఆడు.. అందరితో మంచిగా ఉండు. ఇక్కడ పర్శనల్ ఏమీ లేదు’’ అని తెలిపాడు. 


Also Read: బిగ్ బాస్ హౌస్​లో గ్రాండ్​గా దసరా సెలెబ్రేషన్స్ - చివర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హోస్ట్ అక్కినేని నాగార్జున!