బిగ్ బాస్ హౌజ్‌లో వారమంతా కంటెస్టెంట్స్ ఎంత గొడవపడినా.. ఎంత మనస్పర్థలతో దూరంగా ఉన్నా.. వీకెండ్‌లో నాగార్జున స్టేజ్‌పైకి వచ్చేసరికి వాతావరణం అంతా మారిపోతుంది. నాగార్జునతో సరదా కబుర్లు చెప్తూ, ఆటలు ఆడుతూ.. వారమంతా జరిగిన గొడవలను మర్చిపోతారు కంటెస్టెంట్స్. కానీ నాగార్జున వస్తే ఫుల్ ఫన్ అనే మాట కూడా పూర్తిగా నిజం కాదు.. ఎందుకంటే అప్పటివరకు కంటెస్టెంట్స్ చేసిన తప్పులను ఆయన నోట్ చేసుకొని, ఆ తప్పులను సరిదిద్దడం కోసం వారితో కాస్త కఠినంగా వ్యవహరిస్తారు కూడా. ఇక బిస్ బాస్ సీజన్ 7 మొదటి వారం అంతా ఇప్పటివరకు సరదాగా గడిచిపోయింది. వీకెండ్ కావడంతో నేటి (సెప్టెంబర్ 9న) నాగార్జున వచ్చారు. ముందు ఎప్పటిలాగానే సరదాగా కబుర్లు మొదటిపెట్టి.. ఆ తర్వాత అందరు చేసిన తప్పులను బయటపెట్టడం మొదలుపెట్టారు.


‘జవాన్’ పాటతో నాగ్ ఎంట్రీ..
తాజాగా బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో విడుదలయ్యింది. ‘జవాన్’ పాటతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ముందుగా హౌజ్‌లో షకీలాను పలకరించారు. ‘ఎలా ఉన్నారు’ అని అడిగారు. దానికి సమాధానంగా తేజ.. ‘ఆవిడకేంటి సార్ వణికిస్తారు’ అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత తను హౌజ్‌లో 13 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నట్టు అనుకుంటున్నాని, పూర్తిగా ఇంగ్లీష్‌లో మాట్లాడే కిరణ్ రాథోడ్‌ను తను కంటెస్టెంట్‌లాగా పరిగణించనని అన్నారు నాగ్. దీంతో కిరణ్ షాక్ అయ్యింది. వచ్చిన వారం రోజుల్లో నువ్వేం తెలుగు పదాలు నేర్చుకున్నావ్ చెప్పమని నాగార్జున అడిగారు. దానికి సమాధానంగా కిరణ్ రాథోడ్.. ‘తిన్నావా, పులిహోర’ అంటూ చెప్పడానికి ప్రయత్నించింది. ‘పులిహోర ఎవరు ఎవరితో కలుపుతున్నారు’ అని నాగ్ ప్రశ్నించడంతో కంటెస్టెంట్స్ అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.


కంటెస్టెంట్స్‌తో నాగ్ మొదటి వారం కబుర్లు..
బిగ్ బాస్ సీజన్ 7లో ఈవారం కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్‌ను ఎన్నో విధాలుగా ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు చేశారు. అదే విధంగా యావర్ కూడా ఫ్లర్టింగ్ చేస్తూ ఇంప్రెన్ చేయబోయాడు. కానీ కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా దానిని ఫ్లర్టింగ్ అంటే నమ్మలేకపోయారు. ఇదే విషయాన్ని యావర్‌తో చెప్పారు నాగార్జున. దీంతో ‘ఇప్పుడు ట్రై చేస్తాను’ అంటూ కిరణ్ రాథోడ్‌తో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశాడు యావర్. ఇక హౌజ్‌లోకి వచ్చిన రెండోరోజే.. రతిక చెప్పులు మోశాడు సందీప్. ఆ విషయాన్ని కూడా నాగ్ గుర్తుచేశారు. ‘ఎప్పుడైనా ఇంట్లో మీ ఆవిడ చెప్పులె మోశావా’ అని అడగడంతో సందీప్ దగ్గర సమాధానం లేదు. ఇక గౌతమ్ కృష్ణ, శుభశ్రీ రిలేషన్‌షిప్ గురించి ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్ చేశారు నాగార్జున. వారితో పాటు పల్లవి ప్రశాంత్‌ను కూడా రతిక విషయంలో కాసేపు ఆటపట్టించారు. సరదాగా కబుర్లు ముగిసిన తర్వాత హౌజ్ వాతావరణం పూర్తిగా మారిపోయినట్టుగా ప్రోమోలో చూపించారు.


యావర్, శోభా శెట్టిపై నాగ్ ఫైర్..
ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో ప్రియాంక జైన్.. అందరూ సాధించడానికే వచ్చారు అని గట్టిగా చెప్పింది. ఈ మాట దామినికి నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అసలు ఆ మాటలో తప్పేముంది అంటూ దామినిని ప్రశ్నించారు నాగార్జున. దానికి దామిని సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించింది కానీ అసలు ఆ మాటలో తప్పేమీ లేదు అన్నట్టుగా ప్రేక్షకులకు కూడా అనిపించింది. యావర్‌ను కేవలం ఫిజికల్ బలం చూపించడానికే వచ్చావా అని అడిగారు నాగ్. ఇక చిన్న చిన్న విషయాలకే కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టింది శోభా శెట్టి. ‘మొదటి వారం నుండి కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్‌ను టాప్ 5కు ప్రేక్షకులు పంపించరు’ అని శోభాకు క్లారిటీ ఇచ్చారు నాగ్. 



Also Read: ఒంటరితనం మనిషికి నేర్పేది ఏమిటి? - అగాధం నుంచి ఆకాశానికి, ఈ కాన్సెప్ట్ ఏమిటి?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial