‘బిగ్ బాస్’ సీజన్ 7లో అసలు ఎవరు, ఎవరికి కపుల్.. ఏ ఇద్దరి కంటెస్టెంట్స్ మధ్య ఏం నడుస్తుంది అనేది ఇంకా పూర్తిగా ప్రేక్షకులకు క్లారిటీ రావడం లేదు. తాజాగా ప్రారంభమయిన ‘బిగ్ బాస్’ సీజన్ 7లో రెండు ప్రేమజంటలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. వారే గౌతమ్ కృష్ణ, శుభశ్రీ ఇంకా రతిక, పల్లవి ప్రశాంత్. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అయితే వచ్చిన మొదటిరోజే రతిక.. తన లేడీ లక్ అంటూ బ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ మాత్రమే ఎప్పుడూ కలిసి కనిపిస్తారు. అయితే అసలు పల్లవి ప్రశాంత్‌పై రతికకు ఉన్న ఫీలింగ్ ఏంటి? అనేది నేటి (సెప్టెంబర్ 8న) ప్రసారమైన ఎపిసోడ్‌లో బయటపడింది. వీరి పరిస్థితి ఇలా ఉండగా.. గౌతమ్ కృష్ణ, శుభశ్రీ మధ్య జరిగిన వాగ్వాదం కూడా శుక్రవారం ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. ‘బిగ్ బాస్’ కూడా ఈ పులిహోర లవ్ స్టోరీని వండి వడ్డించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ, అది కాస్తా వికటించి.. ప్రేక్షకులను ఇబ్బంది పెడుతోందనే అభిప్రాయం కలుగుతోంది.


తేజతో డ్యాన్స్.. అందుకే గొడవ..
‘బిగ్ బాస్’ లేటెస్ట్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అందరినీ యాక్టివిటీ రూమ్‌కు పిలిచారు ‘బిగ్ బాస్’. ఆ సమయంలో కంటెస్టెంట్స్ అంతా టైమ్‌పాస్ కోసం సరదాగా పాటలు పాడుకున్నారు, డ్యాన్సులు చేశారు. శుభశ్రీ డ్యాన్స్ చేస్తా అని లేచినప్పుడు గౌతమ్‌ను వెళ్లి జాయిన్ అవ్వమని ప్రియాంక చెప్పింది. ఆ విషయం శుభశ్రీకి నచ్చలేదు. దీంతో టేస్టీ తేజతో కలిసి డ్యాన్స్ చేసింది. ఇక యాక్టివిటీ ఏరియా నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇదే విషయంపై శుభశ్రీతో మాట్లాడే ప్రయత్నం చేశాడు గౌతమ్ కృష్ణ. తనతో డ్యాన్స్ చేయమన్నప్పుడు చేయకపోతే తనను అవమానించినట్టుగా ఉందని అన్నాడు. ఇదే విషయాన్ని హౌజ్ మొత్తానికి చెప్తూ వచ్చింది శుభశ్రీ. దూరంగా ఉండాలనుకుంటున్నావా? ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నావా? అని గౌతమ్ అడిగిన ప్రశ్నకు ‘నీకు నచ్చినట్టు ఉండు’ అంటూ శుభశ్రీ సమాధానం ఇచ్చింది.


పాజిటివ్ వైబ్స్ అంటే ఫీలింగ్స్ ఉన్నట్టే..
ప్రియాంక జైన్.. అలా గౌతమ్‌తో కలిసి డ్యాన్స్ చేయమనడం తనకు నచ్చకపోవడం వల్లే తేజతో కలిసి డ్యాన్స్ చేశానని క్లారిటీ ఇచ్చింది శుభశ్రీ. దీంతో గౌతమ్.. ప్రియాంక, శోభా శెట్టి దగ్గరికి వెళ్లి క్లారిటీ తీసుకోవాలనుకున్నాడు. అప్పుడు ప్రియాంక.. ‘‘నీకు తనపై ఫీలింగ్స్ ఉంటే చెప్పేయవచ్చు కదా’’ అని గౌతమ్‌తో చెప్పింది. ‘‘ఫీలింగ్స్ అని ఏమీ లేవు, కేవలం పాజిటివ్ వైబ్స్’’ అన్నాడు గౌతమ్. ‘‘ఫీలింగ్స్ ఉంటేనే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. పాజిటివ్ వైబ్స్ వస్తే ఫీలింగ్స్ ఉన్నట్టే. రెండు వేర్వేరు కాదు’’ అని శోభా శెట్టి కూడా ప్రియాంక చెప్పిన మాటలను సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. దీంతో గౌతమ్‌కు ఏం చెప్పాలో తెలియక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. గౌతమ్, శుభశ్రీల పరిస్థితి ఇలా ఉండగా.. రతిక, పల్లవి ప్రశాంత్‌ల పరిస్థితి మరొకలా ఉంది. ‘బిగ్ బాస్’.. దామిని కంటెస్టెంట్స్ తలపై గుడ్లు కొట్టాలి అనే టాస్క్ ఇచ్చినప్పుడు రతిక వెళ్లి బాత్రూమ్‌లో దాక్కుంది. ఆ తర్వాత ‘బిగ్ బాస్’.. అందరినీ గార్డెన్ ఏరియాలోకి రమన్నారు. అప్పుడు కూడా రతిక నమ్మలేదు. బాత్రూమ్ నుంచి బయటికి రాలేదు. ఎవరు వచ్చి పిలిచినా ప్రశాంత్ వస్తేనే నమ్ముతాను అంటూ మొండిగా ఉంది. దీంతో కంటెస్టెంట్స్ అందరికీ కోపం వచ్చింది.


పల్లవి ప్రశాంత్‌తో రిలేషన్‌పై రతిక ఫుల్ క్లారిటీ..
కంటెస్టెంట్స్ అంతా సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో ప్రశాంత్‌ను బాబాయ్ అని పిలిచింది రతిక. దానికి ప్రశాంత్ ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ‘‘అసలు ఎందుకలా చేశావ్, బాబాయ్ అని పిలిస్తే ఏంటి, ఎందుకు ఫీలవుతున్నావు’’ అంటూ రతికతో పాటు ఇతర కంటెస్టెంట్స్ కూడా ప్రశాంత్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. అప్పుడు ప్రశాంత్.. సందర్భం వచ్చినప్పుడు చెప్తా అంటూ మాట దాటేశాడు. ఆ తర్వాత రతిక కూడా సెపరేట్‌గా ప్రశాంత్‌ను అడిగింది ‘‘అసలు నీ ఫీలింగ్ ఏంటి’’ అని. అప్పుడు కూడా ప్రశాంత్.. ఎదురుప్రశ్నలు వేశాడు. కానీ రతికకు సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయాడు. అసలు రతిక, ప్రశాంత్ మధ్య ఏముందో క్లారిటీగా తెలుసుకోవడం కోసం రతికను ప్రశ్నించింది శుభశ్రీ. ‘‘అతడంటే వ్యక్తిగతంగా నాకు నిజంగా ఇష్టం. కానీ అదంతా గేమ్ వరకే. ఒక ఫ్రెండ్‌లాగా మాత్రమే’’ అని శుభశ్రీతో పాటు ప్రేక్షకులకు కూడా క్లారిటీ ఇచ్చింది రతిక. ‘‘మరి తన సైడ్ నుంచి ఏంటి’’ అని ప్రశాంత్‌ను ఉద్దేశించి అడిగింది శుభశ్రీ. ‘‘అతడి సైడ్ నుంచి కూడా ఇష్టం ఉంది. కానీ అది నిజమా లేదా గేమ్ వరకేనా అనేది క్లారిటీ లేదు. అడిగితే కూడా తను చెప్పడం లేదు’’ అని.. పూర్తిగా తనకు, పల్లవి ప్రశాంత్‌కు ఉన్న రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చేసింది రతిక.


అయితే, ప్రేక్షకులు మాత్రం వచ్చిన మూడు రోజులకే ప్రేమ, ఫీలింగ్స్ ఏమిటిరా బాబు అని తలలు పట్టుకుంటున్నారు. అప్పట్లో అభిజీత్, అఖిల్, మోనల్ లవ్ స్టోరీ చాలా సహజంగా ట్విస్టులతో సాగింది. బహుశా వీరు అదే స్ఫూర్తితో హౌస్‌లోకి రాగానే కళ్లు కళ్లు కలిపేసుకుని పులిహోర కలిపేసుకున్నారు. ‘బిగ్ బాస్’ కూడా దీన్ని సొమ్ము చేసుకొనేందుకు టేస్టీ తేజా రూపంలో గట్టి గాసిప్‌ను క్రియేట్ చేశాడు. ప్రోమోలో కూడా వీరి ఫేక్ లవ్ స్టోరీనే హైలేట్ చేస్తున్నారు. కానీ, ఈ ‘పులిహోర’ వర్కవుట్ కాలేదని, అసహజంగా ఉండటం వల్ల వికటించిన ఫీలింగ్ కలుగుతోందనేది ప్రేక్షకుల అభిప్రాయం.


Also Read: గేమ్ మొదలెట్టేసిన కంటెస్టెంట్స్ - రతిక, శివాజీనే టార్గెట్ చేస్తూ అలాంటి నిర్ణయం!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial