డిగ్రీ పరీక్ష విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. పీహెచ్‌డీలో విద్యార్థులు పరిశోధనపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగానే.. డిగ్రీలోనూ అలాంటి విధానాన్నే ప్రవేశపెట్లే యోచనలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమాలోచనలు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో పరీక్షలు, మూల్యాంకన విధానాన్ని మార్చాలని భావిస్తోంది. కొత్త విధానం రూప కల్పన బాధ్యతలను ISBకి అప్పగించింది. ఈ మేరకు ఇవాళ ISB, యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. ప్రస్తుత పద్ధతులు, తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు. పరీక్ష విధానంలో మార్పులు విద్యార్థి హితంగా ఉండాలని నిర్ణయించారు. 


రాష్ట్రంలోని విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాలన్న లక్ష్యంతో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)తో రాష్ట్ర ఉన్నత విద్యామండలి గత అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. వచ్చే ఏప్రిల్ నాటికి ఐఎస్‌బీ నివేదిక అందజేయాల్సి ఉంది. ఈ అధ్యయనంపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆచార్య వి.వెంకటరమణ తదితరులు ఐఎస్‌బీ ఆచార్యుడు చంద్రశేఖర్ శ్రీపాద, జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ(నీపా) సహాయ ఆచార్యురాలు గరిమా మాలిక్ తదితరులతో డిసెంబరు 12న చర్చించారు. 


పరీక్షలంటే కేవలం రాయడమే కాకుండా మాట్లాడటం, చర్చించడం లాంటివీ ఉండాలని.. కొన్ని మార్కులకు తరగతి గదిలో విద్యార్థులు ప్రజెంటేషన్ ఇవ్వడం, కొద్ది నిమిషాలు పాఠం బోధించడం లాంటి వాటిని భాగంగా చేయడం వల్ల భవిష్యత్తులో వారికి చేకూరే ప్రయోజనాలపై చర్చించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించడం, చదువు అనంతరం ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా పరీక్షల విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. కోర్‌ సబ్జెక్టుల్లో మార్పులతోపాటు... ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సంస్కృతం (లాంగ్వేజ్‌) సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం అమలవుతున్న పరీక్షలు, మూల్యాంకనం విధానంపై విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ప్రజెంటేషన్ ఇచ్చారు. 


ఉన్నత విద్యలోకి ప్రవేశించే విద్యార్థులు ఏం ఆశిస్తున్నారనే అంశంపై లోతుగా అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అభిప్రాయపడింది. విద్యార్థులకేం కావాలి.? వాళ్లు ఏం కోరుకుంటున్నారు.. అనే ప్రాతిపదికన పరీక్షల విధానం, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు మూల్యాంకన విధానం రూపొందించే దిశగా ముందుకెళుతోంది


ఉన్నత విద్యామండలి, కమిషనర్‌ ఆఫ్‌ కాలేజీ ఎడ్యుకేషన్‌ సంయుక్తంగా ఉన్నత విద్య పరీక్షల విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై అధ్యయనానికి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) తోడ్పాటు తీసుకోనున్నాయి. ఇందుకోసం ఐఎస్‌బీతో ప్రత్యేక అధ్యయనం చేయిస్తున్నట్టు స్పష్టం చేశాయి. పరీక్షలు, మూల్యాంకన విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై చర్చించారు.  ఉన్నత విద్య పూర్తి చేసిన విద్యార్థులకు మార్కెట్లో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగం కోరుకునే అర్హతలపై ఐఎస్‌బీ విశ్లేషణకు ఈ డేటాను వాడుకోనుంది.


మార్పు అనివార్యం: నవీన్‌ మిత్తల్‌
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మూల్యాంకన విధానంలో మార్పులు అవసరమని, దీనికి ప్రత్యేక అధ్యయనం చేయాలని కాలేజీ విద్య కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఉద్దేశంతోనే ఐఎస్‌బీతో క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టినట్టు తెలిపారు. దీనివల్ల ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. 


ఐఎస్‌బీ నివేదిక తర్వాత అమలు: ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి 
ఉపాధి, ఎంటర్‌ ప్రెన్యూర్, సాధికారతకు మూల్యాంకన, విద్యా బోధనలో మార్పులు చేసేందుకు ఐఎస్‌బీ అధ్యయనం కీలకం కానుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి అన్నారు. ఐఎస్‌బీ బృందం వచ్చే ఏప్రిల్ నెలాఖరుకు నివేదిక ఇస్తుందని, ఆ సిఫారసులను వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అమలు చేస్తామని సమావేశం అనంతరం లింబాద్రి వెల్లడించారు. ఐఎస్‌బీ అధ్యయనం తర్వాత ఉపాధి అవసరాలకు తగ్గట్టుగా బోధన ప్రణాళికల్లో మార్పు వచ్చే వీలుందన్నారు. 


తాము చేపట్టబోయే అధ్యయనం గురించి ఐఎస్‌బీ ప్రతినిధి ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ శ్రీపాద ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో పలు విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్లు, ఏడు డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు  పాల్గొన్నారు. 


Also Read:


నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!
నూతన విద్యావిధానంలో భాగంగా ప్రవేశపెట్టిన ఆనర్స్ డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. నాలుగేళ్లు లేదా మూడేళ్లు.. ఆనర్స్ లో ఏ డిగ్రీ కోర్సును ఎంచుకోవాలనే చాయిస్ విద్యార్థులదేనని పేర్కొంది. కాగా, నాలుగేళ్ల డిగ్రీ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులకు మాత్రమే ఆనర్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నట్లు యూజీసీ స్పష్టం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


వెబ్‌సైట్‌లో 'క్లాట్' అడ్మిట్ కార్డులు, 17 వరకు అప్లికేషన్ ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోడానికి అవకాశం!
దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి 'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023' ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబరు 18న క్లాట్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు డిసెంబరు 17న రాత్రి 11.59 గంటలలోపు ప్రవేశ ప్రాధాన్యాలను (అడ్మిషన్ ప్రిఫరెన్సెస్) నమోదుచేయాల్సి ఉంటుంది. 
అడ్మిట్ కార్డు, అడ్మిషన్ ప్రిఫరెన్స్ కోసం క్లిక్ చేయండి..


కామ్‌గా 'బీకామ్‌'లో చేరిపోయారు, 'బీటెక్‌'ను మించి ప్రవేశాలు!
తెలంగాణలో డిగ్రీ కళాశాలల్లో బీకామ్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఏకంగా 'బీటెక్‌'‌ను బీట్ చేసి 'బీకామ్' పైచేయి సాధించింది. బీటెక్‌లో చేరిన విద్యార్థుల కంటే బీకాంలో ప్రవేశాలు పొందినవారి సంఖ్యే అధికంగా ఉండటం ఇదే తొలిసారి అని డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ(దోస్త్) వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.