Fish Lorry Overturnde In Mahabubabad: చేపల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం రహదారిపై ప్రమాదవశాత్తు బోల్తా పడగా ఒక్కసారిగా ప్రజలు చేపల కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా.. అతన్ని పట్టించుకోకుండా చేపలు పట్టుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) మరిపెడ (Maripeda) మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు చేపల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న చేపలు రోడ్డుపై పడ్డాయి. దీన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా చేపల కోసం ఎగబడ్డారు. బతికున్న చేపలను ఎవరికి దొరికినవి వారు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపు చేశారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. చేపల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం ఖమ్మం నుంచి వరంగల్ వైపు వస్తోన్న క్రమంలో మరిపెడ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. కాగా, చేపల కోసం జనం ఎగబడిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.



Also Read: KTR News: ఆ హైడ్రా బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి, ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్