చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కార్తికేయపురంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. తన ఇంటి సమీపంలో మహిళా కానిస్టేబుల్ సుకన్య ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడారు. కానిస్టేబుల్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 2014 పోలీస్ బ్యాచ్‌కు చెందిన సుకన్య... తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్‌ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఐదేళ్ల క్రితం పెనుమూరు మండలం‌ కార్తికేయపురానికి చెందిన ప్రసాద్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 


కుటుంబ నియంత్రణ విషయంలో వారి కుటుంబలో చిన్న చిన్న గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంలో సుకన్య తనకు ఇద్దరు పిల్లలు చాలని, అత్త, భర్తతో గట్టిగా వారించేవారు. కానీ తమకు మగబిడ్డ కావాలని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకునేందుకు ఒప్పుకోలేమని భర్త ప్రసాద్, అత్త తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై అత్త, భర్తతో సుకన్య గొడవ పడి, తను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చిందని స్థానికులు అంటున్నారు. భర్త, అత్త వైఖరితో తీవ్ర మనస్తాపానికి గురైన సుకన్య ఇంటికి సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకుని‌ మృతి చెందినట్లు తెలుస్తోంది. 
Also Read: YSRCP Vs RRR: రఘురామ వర్సెస్ విజయసాయి పరస్పర ఫిర్యాదులు.. ఎవరి స్కాంలు బయటపడబోతున్నాయి..?


అయితే బయటకు వెళ్లిన సుకన్య ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో గాలించారు. కానీ ఆమె జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఇంటికి తిరిగి వచ్చేశారు. ఇంతలో గ్రామంలోని ఓ పశువుల‌ కాపరి ఇంటికి వచ్చి సుకన్య ఆత్యహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపాడు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో‌ మునిగి పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కుటుంబ కలహాల విషయంగా సుకన్య ఆత్యహత్యకు పాల్పడిందా..లేక అత్త, భర్త ప్రసాద్ హత్య చేశారా అనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. 


Also Read: KRMB GRMB Meeting: నేడు కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం... హాజరుకాలేమని తెలంగాణ సర్కార్ లేఖ


Also Read: Hyderabad Realtor Murder: రియల్టర్ హత్య కేసులో మలుపు.. ఓ మాజీ ఎమ్మెల్యే హస్తం..! అసలు సంగతి ఏంటంటే..