Cyber Frauds In AP And Telangana: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేసి ఏపీకి చెందిన ఓ వైద్యుని వద్ద రూ.38 లక్షలు కొట్టేశారు. అటు, తెలంగాణలోనూ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి రూ.10 వేలు ఆశ చూపి రూ.2.29 కోట్లు కొల్లగొట్టారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నంద్యాల Nandyal Town) పట్టణం పద్మావతినగర్‌లో రాహుల్ ఆస్పత్రి అధినేత డాక్టర్ రామయ్యకు 2 రోజుల కిందట సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. తాము సీబీఐ అధికారులమని సీబీఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. మీ సెల్ నెంబర్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందని.. దీనిపై ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో హ్యూమన్ ట్రేడింగ్, మనీ లాండరింగ్, ఛీటింగ్ కేసులు నమోదయ్యాయని భయపెట్టారు. ఆన్ లైన్ విచారణ జరుపుతామని.. డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు.


రూ.38 లక్షలు కొట్టేశారు


దీంతో వైద్యుడు ఆందోళనకు గురి కాగా.. దీన్ని ఆసరాగా చేసుకుని రూ.38 లక్షలు పంపితే కేసుల నుంచి తప్పిస్తామని.. లేకుంటే అరెస్ట్ చేస్తామని బెదిరించారు. భయపడిన వైద్యుడు వారి చెప్పినట్లే చేశారు. తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాకు రూ.38 లక్షలు పంపించారు. అలాగే, అరగంట పాటు డాక్టర్‌ను కాల్‌లో ఉంచి ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి హ్యాక్ చేశారు. ఆ తర్వాత మోసపోయానని తెలుసుకున్న డాక్టర్ టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


అటు, కర్నూలు జిల్లా (Kurnool District) ఆదోని పట్టణం అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు నకిలీ ఆర్టీవో అధికారుల అవతారమెత్తారు. ఈ నెల 8న వాహనాలను ఆపుతూ డబ్బులు వసూలు చేశారు. ఓ వాహనానికి పత్రాలు సరిగా లేవని.. రూ.లక్ష ఇస్తే వదిలేస్తామని లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా వాహన యజమానులపై చేయి చేసుకున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం వెలుగుచూసింది. ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


తెలంగాణలో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి టోకరా


తెలంగాణలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి షేర్లు విక్రయిస్తామంటూ రూ.10 వేలు ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు.. రూ.2.29 కోట్లు కొట్టేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లికి (Bachipalli) చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి (51) ఫోన్ నెంబరును గుర్తు తెలియని వ్యక్తులు జులై 10న 'కేఎస్ఎల్ అఫీషియల్ స్టాక్' పేరిట ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చారు. నారాయణ జిందాల్ అనే వ్యక్తి కోటక్ సెక్యూరిటీస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారని, షేర్ల క్రయవిక్రయాలపై మెలకువలు నేర్పిస్తుంటారని.. గ్రూపులోని సభ్యులు తరచూ చాటింగ్ చేసేవారు. ఈ నెల 2 నుంచి ప్లాన్ ప్రారంభిస్తున్నట్లు నారాయణ జిందాల్ పేరుతో ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. ఇందులో చేరాలంటే కోటక్ ప్రో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని.. వీఐపీ ట్రేడింగ్ ప్లాన్‌లో చేరితే లాభాలు వస్తాయని చెప్పేవాడు. చాలా మంది తమకు లాభాలు వచ్చాయని పోస్ట్ చేసేవారు.


ఇదంతా నిజమని నమ్మిన సాప్ట్ వేర్ ఇంజినీర్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. అందులో కస్టమర్ కేర్ ప్రతినిధి సూచనల ప్రకారం డబ్బులు పంపించేవాడు. తొలిసారి రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టినందుకు 10 శాతం లాభం వచ్చినట్లు మరుసటి రోజు యాప్‌లో మోసగాళ్లు చూపించారు. ఈ క్రమంలో పలు ధపాలుగా రూ.90 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇలా మొత్తం రూ.2.29 కోట్లు బదిలీ చేయించుకున్నారు. కేవలం రూ.10 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఇచ్చారు. రూ.2.29 కోట్ల పెట్టుబడికి రూ.1.10 కోట్ల లాభం వచ్చిందని.. మరో రూ.40 లక్షలు కడితేనే విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పారు. ఈ నిబంధనలతో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి అనుమానం రావడంతో.. ఆరా తీయగా అది మోసమని తేలింది. దీంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదైంది.


Also Read: EPFO News: ఈపీఎఫ్‌ విత్‌డ్రాలో పెను మార్పులు?, కనీస పెన్షన్ పరిమితి కూడా పెంపు!