Muhurat Trading session 2023: దక్షిణ భారతదేశంలో దీపావళి ఒక్కరోజే పండుగ జరుపుకున్నా, ఉత్తర భారతదేశంలో ఈ వేడుకలు 5 రోజులు ఉంటాయి. ఈ 5 రోజుల వేడుకలో, ఈ రోజు (శుక్రవారం, 10 నవంబర్‌ 2023) ధన్‌తేరస్‌ పండుగ. ఈ రోజున, బంగారం, షేర్లు, స్థిరాస్తి వంటి ఏ రకమైన ఆస్తిలో పెట్టుబడి పెట్టినా అది భారీ సంపద సృష్టిస్తుందని నమ్ముతారు. 


బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ BSE, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ NSE షెడ్యూల్ ప్రకారం, స్టాక్‌ మార్కెట్లకు ఈ నెల 14న (మంగళవారం) దీపావళి సెలవు ఉంటుంది. ఆ రోజు మొత్తం ఏ సెగ్మెంట్‌లోనూ ట్రేడ్‌ జరగదు. అయితే, లక్ష్మీపూజ సందర్భంగా ఈ నెల 12న (ఆదివారం) ఒక గంట పాటు ముహూరత్‌ ట్రేడింగ్ ‍‌(Muhurat Trading 2023) ఉంటుంది. 


ముహూరత్‌ ట్రేడింగ్ టైమింగ్స్‌
ప్రతి సంవత్సరం దీపావళి వేడుకల సందర్భంగా, లక్ష్మీపూజ జరిగే రోజున ముహూరత్‌ ట్రేడింగ్ కూడా జరుగుతుంది. ఆ రోజున కనీసం ఒక్క షేర్‌ అయినా కొన్నాలన్నది చాలా మంది స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌. ఆ ట్రేడింగ్‌ను వల్ల  శుభప్రదంగా భావిస్తారు. అయితే, ముహూరత్‌ ట్రేడింగ్‌ జరిగే రోజున, సాధారణ రోజుల్లోలాగా ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కాకుండా, సాయంత్రం పూట కేవలం ఒక గంట పాటు మాత్రమే లావాదేవీలకు అనుమతిస్తారు. 


ఈ ఏడాది నవంబర్ 12న లక్ష్మీపూజ సందర్భంగా, సాయంత్రం 6:15 నుంచి 7:15 వరకు మార్కెట్‌లో ముహూరత్‌ ట్రేడింగ్‌ ఉంటుంది. ఈ టైమ్‌లో షేర్లను కొనొచ్చు, అమ్మొచ్చు. F&Oలోనూ కూడా ట్రేడ్‌ చేయొచ్చు. ట్రేడ్‌ మాడిఫికేషన్స్‌ కోసం 7:25 PM వరకు అనుమతిస్తారు. చివరగా, క్లోజింగ్‌ సెషన్ రాత్రి 7:25 నుంచి 7:35 వరకు జరుగుతుంది.


సాయంత్రం 6:00-6:08 మధ్య ప్రి-ఓపెన్ సెషన్ కోసం 8 నిమిషాల విండో కేటాయించారు. బ్లాక్ డీల్ సెషన్‌ 5:45 PMకి ఓపెన్‌ అవుతుంది, 6 PM వరకు ఉంటుంది.


ముహూరత్‌ ట్రేడింగ్ అంటే ఏంటి?
ముహూరత్‌ ట్రేడింగ్ (ప్రత్యేక ముహూర్తపు ట్రేడింగ్‌) అనేది దీపావళి సందర్భంగా నిర్వహించే స్పెషల్‌ సెషన్. పండుగ రోజు మొత్తం స్టాక్ మార్కెట్‌ను మూసేసినా, ముహూరత్‌ ట్రేడింగ్ కోసం ఒక గంట పాటు ఓపెన్‌లో ఉంటుంది. లక్ష్మీపూజ చేసే టైమ్‌లో ముహూరత్‌ ట్రేడింగ్‌ జరుగుతుంది కాబట్టి, ఈ గంట సమయంలో షేర్లు కొంటే సంపద పెరుగుతుందని, నూతన సంవత్‌లో అవి అదృష్టాన్ని తెస్తాయని చాలామంది పెట్టుబడిదార్లు విశ్వసిస్తారు.


2018 నుంచి ముహూరత్‌ ట్రేడింగ్ సెషన్‌ గ్రీన్‌లో ముగుస్తోంది. 2022 సెషన్‌లో సెన్సెక్స్ 0.88 శాతం లాభపడింది. 2021లో 0.49 శాతం ప్రాఫిట్‌తో ముగిసింది. 2020, 2019లో, BSE యొక్క బెంచ్‌మార్క్ ఇండెక్స్ వరుసగా 0.45 శాతం, 0.49 శాతం లాభపడింది.


ముహూర్తం ట్రేడింగ్ ఎప్పుడు ప్రారంభించారు?
కొన్ని రిపోర్ట్స్‌ ప్రకారం, దీనిని, ప్రాచీన భారతదేశంలో రాజు విక్రమాదిత్య ప్రారంభించాడు. 1957లో BSE దీన్ని మొదటిసారిగా అవలంబించింది, ఈ పద్ధతికి అధికారిక గుర్తింపును ఇచ్చింది. NSE, 1992 నుంచి ముహూరత్‌ ట్రేడింగ్‌ స్టార్ట్‌ చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా, కోట్ల మంది ఇన్వెస్టర్లు/ట్రేడర్లు ఈ స్పెషల్‌ ట్రేడింగ్ సెషన్‌లో పాల్గొంటున్నారు. 


శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులు కాకుండా... ఈ నెల 14న దీపావళి, 27న గురునానక్ జయంతి, వచ్చే నెల 25న (డిసెంబర్‌ 25) క్రిస్మస్‌ సందర్భంగా స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: క్రాకర్స్‌లా పేలే 10 దీపావళి స్టాక్స్‌ - స్మాల్‌ & మిడ్‌ క్యాప్స్‌లో ఇవి ప్రత్యేకమట!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial