Lotus Chocolate Company Share Price: ముకేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ప్రత్యక్షంగా & పరోక్షంగా చాలా రంగాల్లోని చాలా కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి. అంబానీ చేయి పడిందంటే ఏ కంపెనీ స్టార్‌ అయినా మారిపోవాల్సిందే. లోటస్ చాక్లెట్ కంపెనీది (Lotus Chocolate Company Ltd) కూడా అదే కథ. ఇప్పుడు, ఈ కంపెనీ తన షేర్‌హోల్డర్లకు తియ్యటి లాభాలను పంచుతోంది. 


లోటస్ చాక్లెట్ కంపెనీ షేర్‌ ధర 2021 సెప్టెంబర్‌లో రూ.35గా ఉంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు 5,062% పెరిగి, ప్రస్తుతం రూ.1,807కి చేరుకుంది. ఈ పెరుగుదలలో ఎక్కువ భాగం గత నాలుగు నెలల్లోనే వచ్చింది. ఈ 4 నెలల్లోనే ఈ స్టాక్ 404% పెరిగింది.


రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (RRVL) FMCG విభాగం అయిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL), 2023 మార్చిలో, రూ.74 కోట్లు ఖర్చు పెట్టి లోటస్ చాక్లెట్‌లో 51% వాటాను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ కంపెనీ షేర్లు F1 కార్‌లా దూసుకుపోతున్నాయి.


కంపెనీ షేర్ల పనితీరు
BSE డేటా ప్రకారం, లోటస్ చాక్లెట్‌ కంపెనీ స్టాక్ గత 3 నెలల్లోనే 365 శాతం, గత 6 నెలల్లో 433 శాతం పెరిగింది. ఈ షేర్లు 2024లో ఇప్పటి వరకు ‍‌(YTD) ఏకంగా 506 శాతం రిటర్న్‌ ఇచ్చాయి. గత 5 సంవత్సరాలలో ఈ షేర్లు ఆశ్చర్యకరంగా 10984% దూసుకెళ్లాయి. 


మూడు సంవత్సరాల క్రితం, లోటస్ చాక్లెట్ స్టాక్ సుమారు రూ.35 వద్ద ట్రేడ్ అవుతోంది. 5 సంవత్సరాల క్రితం రూ.16 దగ్గర ఉంది. 2021 సెప్టెంబర్ 06న, BSEలో ఈ షేర్‌ ప్రైస్‌ రూ.35.15 వద్ద ముగిసింది. 2003 సెప్టెంబర్‌లో షేరు ధర కేవలం 2 రూపాయలు. ఒక వ్యక్తి, 21 ఏళ్ల క్రితం ఈ స్టాక్‌లో రూ.10,000 ఇన్వెస్ట్ చేసి దానిని అలాగే వదిలేస్తే, ఇప్పుడు ఆ విలువ రూ.9 లక్షలకు పైగా ఉండేది.


లోటస్ చాక్లెట్ కంపెనీ వివరాలు
లోటస్ చాక్లెట్ భారతదేశంలోని ప్రీమియం చాక్లెట్‌లు, కోకో ఉత్పత్తులు తయారు చేస్తుంది. స్థానిక బేకరీల నుంచి బహుళజాతి కంపెనీల వరకు విస్తృత శ్రేణి కస్టమర్‌లు దీని సొంతం. మన దేశంలోని చాక్లెట్ & మిఠాయిల పరిశ్రమ రూ.25,000 కోట్లను అధిగమిస్తుందని అంచనా. దీనిలో చాక్లెట్లది మూడింట రెండు వంతుల వాటా. ఈ పరిశ్రమ వచ్చే నాలుగేళ్లలో రూ.35,000 కోట్లకు పైగా వృద్ధి చెందుతుందని మార్కెట్‌ ఎనలిస్ట్‌లు లెక్కగట్టారు. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఓలా ఎలక్ట్రిక్‌కు మరో భారీ దెబ్బ - షోకాజ్ నోటీస్‌తో షాక్‌ ఇచ్చిన 10 వేల మంది కస్టమర్లు