LIC and Income Tax Offices Work On Sunday: దేశంలో అతి పెద్ద బీమా కంపెనీ 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) కార్యాలయాలు మార్చి 30వ తేదీ శనివారం, మార్చి 31వ తేదీ ఆదివారం కూడా పని చేస్తాయి.  సాధారణంగా, శని & ఆదివారాల్లో ఎల్‌ఐసీ ఆఫీస్‌లకు సెలవు. మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున, శనివారం & ఆదివారం కూడా కార్యాలయాలన్నీ తెరిచి ఉంచాలని LIC నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 చివరి రోజు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఏ పనైనా చివరి రోజుల్లో పూర్తి చేయడంలో కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా LIC ఈ నిర్ణయం తీసుకుంది. 


ఎల్‌ఐసీ పాటు అనేక బీమా కంపెనీలు కూడా ఈ వారాంతంలో కార్యాలయాలు తెరవాలని నిర్ణయించాయి.


పాలసీదార్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, అన్ని బీమా కంపెనీలను మార్చి 30 & 31 తేదీల్లో, అంటే శని & ఆదివారాల్లో కార్యాలయాలు తెరిచి ఉంచాలని  'ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా' (IRDAI) ఆదేశించింది. ఈ ఆదేశం అందిన తర్వాత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్ని ఖాతాదార్లు సాఫీగా ముగించేలా సాయం చేసేందుకు శనివారం & ఆదివారం కూడా పని చేస్తామని LIC ప్రకటించింది. అన్ని ఎల్‌ఐసీ శాఖలు శని, ఆదివారాల్లో సాధారణ రోజుల మాదిరిగానే, సాధారణ పని గంటల ప్రకారం పని చేస్తాయి. ఎల్‌ఐసీకి సంబంధించిన ఏదైనా పని పూర్తి చేయాల్సి వస్తే, మీరు వారాంతాల్లో కూడా ఎల్‌ఐసీ ఆఫీస్‌కు వెళ్లొచ్చు.


ఆదాయ పన్ను ఆఫీస్‌లకు కూడా ఆదివారం వర్కింగ్‌ డే
2023-24 ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కాబట్టి, ఆదాయ పన్ను విభాగం కార్యాలయాలు కూడా మార్చి 30, 31 తేదీల్లో తెరిచి ఉంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదార్లు ఇంకా ఏదైనా పని పూర్తి చేయాల్సి ఉంటే, శని & ఆదివారాల్లో ఆ పనిని పూర్తి చేయవచ్చు. లేదా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్లాల్సివస్తే నిరభ్యంతరంగా వెళ్లొచ్చు.


శని, ఆదివారాలు బ్యాంకులకూ పని దినాలే
మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న దృష్ట్యా, శని & ఆదివారాల్లో పని చేయాలని అన్ని ఏజెన్సీ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ (RBI) గతంలోనే ఆదేశించింది. ఏజెన్సీ బ్యాంకుల్లో 12 ప్రభుత్వ బ్యాంకులతో సహా మొత్తం 33 బ్యాంకులు ఉన్నాయి. స్టేట్‌ బ్యాంక్‌ (SBI), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్‌తో సహా అన్ని ప్రధాన బ్యాంకులు శని, ఆదివారాల్లో పని చేస్తాయి. ఈ రెండు రోజుల్లో చెక్ క్లియరింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) రెండూ మార్చి 31 అర్ధరాత్రి వరకు నిరాటంకంగా పని చేస్తాయి. స్పెషల్‌ డిపాజిట్‌ పథకాలు, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), కిసాన్‌ వికాస్‌ పత్ర ‍‌(KVP), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పథకాల్లో కనీస డిపాజిట్‌ చేయడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి కూడా మార్చి 31 చివరి రోజు కాబట్టి, వీటికి సంబంధించిన లావాదేవీలను కూడా అనుమతిస్తారు.


మరో ఆసక్తికర కథనం: NPS నుంచి EPF వరకు -ఏప్రిల్ 01 నుంచి చాలా మార్పులు