Financial Rules Changing from 01 April 2024: ఏప్రిల్‌ 01 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 ప్రారంభం అవుతుంది. కొత్త ఫైనాన్షియల్‌ ఇయర్‌ రాకతో డబ్బుకు సంబంధించిన అనేక నియమనిబంధనలు మారుతున్నాయి, అవి జనం జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఫాస్ట్‌ట్యాగ్ KYC నుంచి NPSలో లాగిన్ రూల్‌ వరకు, కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి చాలా విషయాలు అప్‌డేట్‌ అవుతాయి. 

Continues below advertisement


ఏప్రిల్ 01 నుంచి మారబోతున్న ఆర్థిక నియమాలు


1. NPS లాగిన్‌ కోసం ఆధార్ అథెంటికేషన్‌ అవసరం
పెన్షన్ రెగ్యులేటర్ PFRDA, నేషనల్‌ పెన్షన్‌ సిస్టం (NPS) ఖాతాలోకి లాగిన్ అయ్యే నిబంధన మార్చింది. 01 ఏప్రిల్‌ నుంచి, NPS ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి యూజర్ ID & పాస్‌వర్డ్ మాత్రమే సరిపోదు. మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా అవసరం. NPS ఖాతా లాగిన్ కోసం యూజర్ ID, పాస్‌వర్డ్ ఎంటర్‌ చేయగానే, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని కూడా నమోదు చేసిన తర్వాత మాత్రమే NPS ఖాతాలోకి వెళ్లగలరు.


2. EPFO నియమాలలో మార్పులు
'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (ఈపీఎఫ్‌ఓ) నిబంధనల్లో ఏప్రిల్‌ 01 నుంచి అతి పెద్ద మార్పు రానుంది. కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) నుంచి, ఒక వ్యక్తి ఉద్యోగం మారితే అతని EPF ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త కంపెనీకి బదిలీ అవుతుంది. ఇప్పటి వరకు ఖాతాదారు అభ్యర్థనపై మాత్రమే ఖాతాను బదిలీ చేసేవాళ్లు.


3. డిఫాల్ట్ ఆప్షన్‌గా కొత్త పన్ను విధానం (New tax regime)
ఏప్రిల్ 01 నుంచి, కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారుతుంది. మీరు పాత లేదా కొత్త పన్ను విధానంలో ఏదో ఒకటి ఎంచుకోకపోతే, మీ ITR కొత్త పన్ను విధానంలోనే ఫైల్‌ అవుతుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే, అదే పద్ధతిలో ITR పైల్‌ చేయవచ్చు. కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఒక్క రూపాయి కూడా టాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు.


4. ఫాస్టాగ్ KYC అవసరం
ఫాస్టాగ్ యూజర్లు మార్చి 31 లోగా KYC అప్‌డేట్ చేయాలని NHAI సూచించింది. అలా చేయడంలో విఫలమైతే 01 ఏప్రిల్‌ నుంచి ఆ ఫాస్టాగ్ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. ఇదే జరిగితే, ఖాతాలో డబ్బు ఉన్నప్పటికీ టోల్ గేట్‌ దగ్గర చెల్లింపులు చేయలేరు.


5. SBI క్రెడిట్ కార్డ్‌ &డెబిట్ కార్డ్‌ నియమాలు
కోట్లాది మంది ఖాతాదార్లకు షాక్ ఇస్తూ, దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ SBI వివిధ డెబిట్ కార్డుల (ATM Cards) వార్షిక నిర్వహణ ఛార్జీని ఏకంగా 75 రూపాయలు పెంచాలని నిర్ణయించింది. ఇది ఏప్రిల్ 01 నుంచి అమల్లోకి రానుంది. దీంతో పాటు, క్రెడిట్ కార్డ్ వినియోగదార్లకు కూడా ఝలక్‌ ఇచ్చింది. SBI క్రెడిట్‌ కార్డ్‌తో చేసే అద్దె చెల్లింపుపై లభించే రివార్డ్ పాయింట్లను ఏప్రిల్ 01 నుంచి నిలిపివేస్తోంది. AURUM, SBI కార్డ్ ఎలైట్, SBI కార్డ్ పల్స్, SBI కార్డ్ ఎలైట్ అడ్వాంటేజ్, SimplyClICK SBI కార్డ్ యూజర్ల మీద ఈ ప్రభావం పడుతుంది.


6. యెస్‌ బ్యాంక్‌, ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్ రూల్స్‌
యెస్ బ్యాంక్ కూడా తన క్రెడిట్ కార్డ్ నిబంధనలు మార్చింది. ఈ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్ వినియోగదారు ఒక త్రైమాసికంలో కనీసం రూ. 10,000 ఖర్చు చేస్తే దేశీయ విమానాశ్రయ లాంజ్ (Domestic airport lounge) యాక్సెస్‌ పొందుతాడు. ఏప్రిల్ 01 నుంచి ఈ సదుపాయం అమలులోకి వస్తుంది. ICICI బ్యాంక్ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. తన కస్టమర్లు ఒక త్రైమాసికంలో రూ. 35,000 వరకు ఖర్చు చేస్తే, కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ను అందిస్తోంది. ఈ మార్పు నిబంధన ఏప్రిల్ 1, 2024 నుంచి అమలులోకి వస్తుంది.


7. ఔషధాల ధరలు పెంపు
'నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్' (NLEM) కింద కొన్ని అత్యవసర ఔషధాల ధరలను 0.0055 శాతం పెంచుతున్నట్లు భారత ఔషధ ధరల నియంత్రణ సంస్థ ప్రకటించింది. ఈ ప్రకారం, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్షన్ మెడిసిన్స్‌ సహా చాలా ముఖ్యమైన మందుల ధరలు ఏప్రిల్ 01, 2024 నుంచి పెరుగుతాయి.


మరో ఆసక్తికర కథనం: ఆదివారం కూడా బ్యాంక్‌లు పని చేస్తాయి, సెలవు లేదు