IT Stocks Slump: ఐటీ కంపెనీల షేర్లు మదుపర్లకు పెద్ద షాకిచ్చాయి! ఇన్ఫీ, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ సహా అనేక ఐటీ కంపెనీల షేర్లను మదుపర్లు తెగనమ్ముతున్నారు. వచ్చే ఏడాది ఈ కంపెనీల వాల్యుయేషన్లు మరింత తగ్గుతాయని క్రెడిట్‌ సూయిస్‌ సెక్యూరిటీస్‌ ఇండియా హెచ్చరించడమే ఇందుకు కారణం.


అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు అలుముకుంటున్నాయి. పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ ఏమాత్రం బాగాలేదు. ఫలితంగా భారత ఐటీ కంపెనీల ప్రస్తుత వాల్యుయేషన్లు నిలబడకపోవచ్చని క్రెడిట్‌ సూయిస్‌ తెలిపింది. 2023 ఆర్థిక ఏడాది ద్వితీయార్థంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటుందని అంచనా వేసింది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లను మరింత పెంచుతుండటం ఇందుకు సంకేతాలు ఇస్తోందని వెల్లడించింది. ద్రవ్యోల్బణం పెరగడంతో మార్చి నుంచి యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్లను 350 పాయింట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే.


ప్రస్తుతం భారత ఐటీ కంపెనీలకు 60 శాతం ఆర్డర్లు అమెరికా నుంచే వస్తున్నాయి. ఆదాయంలో ఎక్కువ వాటా అక్కడ్నుంచే వస్తుంది. ఒకవేళ ఆ దేశం మాంద్యంలోకి జారుకుంటే భారత ఐటీ రంగంపై పెద్ద దెబ్బే పడుతుంది. క్లయింట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సంబంధిత సేవలపై ఖర్చులు తగ్గించుకుంటామని అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ క్లయింట్లు ఈ మధ్యే పేర్కొన్న సంగతి తెలిసిందే. 


'స్వల్ప హెచ్చరికలు మొదలయ్యాయి. 2023లోకి వెళ్లేకొద్దీ మరింత పెద్దవి అవుతాయి. టెక్నాలజీ, ఎగుమతి ఆధారిత కంపెనీల షేర్లను కొనుగోలు చేయొద్దు. ఆరు నెలల తర్వాత చాలా తక్కువ ధరకు దొరుకుతాయి' అని ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఈక్విటీ మాజీ హెడ్‌ సందీప్‌ సభర్వాల్‌ ఇంతకు ముందే ట్వీట్‌ చేయడం గమనార్హం.


గురువారం మధ్యాహ్నం 2 గంటలకు నిఫ్టీ ఐటీ సూచీ 3.35 శాతం వరకు పతనమైంది. ఏకంగా 1009 పాయింట్లు నష్టపోయింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ 6.85, ఎంఫాసిస్‌ 4.55, టెక్‌ మహీంద్రా 3.47, ఎల్‌టీటీఎస్‌ 3.36, ఇన్ఫీ 3.32, కో ఫోర్జ్‌ 2.77, విప్రో 2.75, టీసీఎస్‌ 3.35 శాతం మేర పతనమయ్యాయి. బెంచ్‌ మార్క్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ విలవిల్లాడుతున్నాయి.


Also Read: వర్కవుట్‌ అయిన పేటీఎం ప్లాన్‌, సర్రున పెరిగిన షేర్‌ ధర


Also Read: 5 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్‌ - టీసీఎస్‌ను సాయం కోరిన బీఎస్ఎన్ఎల్!