Budget 2023:


పుత్తడి, నగల పరిశ్రమలో మరింత పారదర్శకత పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నాయి. ఎదిగేందుకు అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా తమదైన పాత్ర పోషించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. దిగుమతి సుంకాలు తగ్గించాలని, ఎగుమతులు పెంచేలా బడ్జెట్‌లో ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు.


'భారత ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే సత్తా బంగారం పరిశ్రమకు ఉంది. విస్తృతమైన మార్కెట్‌, దేశీయంగా కొనుగోళ్లు, ప్రత్యేక సీజన్లలో ప్రవాస భారతీయులు కొనుగోళ్లు చేపట్టడం ఈ రంగానికున్న ప్రత్యేకత. జీఎస్‌టీ అమలు, తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ వంటి నిబంధనలు భారత పుత్తడి పరిశ్రమను వ్యవస్థీకృతంగా మారుస్తున్నాయి. మన బంగారం పరిశ్రమ మరింత అభివృద్ధి చెందేలా, అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా ఎదిగేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలి. సరైన నిర్ణయాలు తీసుకొని ప్రోత్సహిస్తే పరిశ్రమ మరింత వ్యవస్థీకృతం అవుతుంది. పారదర్శకత పెరిగితే వినియోగదారులకు సాధికారికత లభిస్తుంది' అని కల్యాణ్ జువెలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేశ్ కల్యాణ్‌రామన్‌ అన్నారు.


Also Read: హైదరాబాద్‌లో డిసెంబర్లో రిజిస్టరైన ఇళ్లెన్నో తెలుసా! 16% పెరిగిన ధరలు!


Also Read: ఆర్థిక సర్వే అంటే ఏంటి? ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దీని ప్రాముఖ్యం ఏంటి?


నవీ ముంబయిలో సరికొత్త జువెలరీ పార్క్‌ ఆవిష్కరణ, సూరత్‌లో తయారీ సౌకర్యాల విస్తరణతో బంగారం పరిశ్రమ వైవిధ్యం, వినూత్నత సంతరించుకుంటోందని కల్యాణ్‌ రామన్‌ పేర్కొన్నారు. మరింత కట్టుదిట్టమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌తో ఈ రంగంలో డిజిటైజేషన్‌ పెరుగుతుందని వెల్లడించారు. ఫలితంగా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.


ప్రపంచం ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుంటున్న నేపథ్యంలో బంగారం పరిశ్రమ బడ్జెట్‌ గురించి సానుకూలంగా ఎదురు చూస్తోందని డబ్ల్యూహెచ్‌పీ జువెలర్స్‌ డైరెక్టర్‌ ఆదిత్య పీఠె అన్నారు. భారత్‌లో దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని నిపుణుల అంచనా వేస్తున్నా, మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భద్రత కోరుకుంటున్నామని వెల్లడించారు. దిగుమతి సుంకం తగ్గించి, ఎగుమతులను ప్రోత్సహించేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు.


'వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌. వృద్ధికి ఊతమిచ్చేలా, పన్నులు తగ్గించేలా ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం' అని ఉత్తర్‌ ప్రదేశ్‌ ఐస్‌ఫ్రా జెమ్స్‌, జువెల్స్‌ డైరెక్టర్‌ వైభవ్‌ సరఫ్‌ అన్నారు. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత పుత్తడి రంగాల్లో ధరల అంతరం 5 శాతానికి చేరుకుందన్నారు. దీనిని తగ్గించాలన్నారు. డాలర్‌ మారకం రేటు వల్ల అంతర్జాతీయ, స్థానిక ధరల్లో తేడా అధికంగా ఉందన్నారు.


సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి: