Sri Rama Navami 2022 In Andhra Pradesh: గతంలో చెప్పినట్టుగానే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గంతో రాజీనామాలు చేయించారు. వారిలో మళ్ళీ నలుగురైదుగురికి మంత్రి పదవులు రావడం ఖాయమనే చెబుతున్నా ప్రస్తుతానికి వారెవరన్నది సస్పెన్స్ గానే ఉంది . ఈనెల 11 న జరిగే కొత్త కేబినెట్ ప్రమాణస్వీకారంతో పాటే వారూ ప్రమాణ స్వీకారం చేస్తారు . ఇదంతా బానే ఉంది కానీ మంత్రులు రాజీనామా చేసింది 7వతేదీన. తిరిగి ఏపీలో కొత్త మంత్రులు 11 వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు 


జగన్.. ఒకే ఒక్కడు ! 
ఏప్రిల్ 10 తేదీన శ్రీరామనవమి. ఆరోజున రాష్ట్రంలో మంత్రిగా ఉండేది కేవలం సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. అంటే శ్రీరామ నవమి రోజున శ్రీరాముని కళ్యాణం, పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో ఏపీలో మాత్రం ఒక్క జగన్ మాత్రమే ఏపీ కేబినెట్‌లో ఉంటారు. కాస్త విచిత్రమైన పరిస్థితి ఇది. ఆరోజున ప్రభుత్వం నుండి రాష్ట్రంలోని వివిధ రామాలయాలకు పట్టువస్త్రాలు వెళుతూ ఉంటాయి. సీఎం చేతులు మీదుగా ఒంటిమిట్ట రామాలయానికి పట్టు వస్త్రాలు వెలుతాయి.


జిల్లాల్లోని ప్రధాన ఆలయాల్లోని రామాలయాలకు స్థానిక మంత్రులు హాజరవుతారు. కానీ ఈసారి రామనవమి నాడు అలాంటి దృశ్యం చూడలేము.  ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర మంత్రులంతా సీఎం జగన్ సూచనతో రాజీనామా చేశారు. దాంతో ఈసారి మాజీ మంత్రుల హోదాలోనో లేకుంటే స్థానిక ఎమ్మెల్యే అనే హోదాలోనే  వారు ఆలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అధికారిక వస్త్రాలు రామునికి సమర్పించే పనిని బహుశా అధికారులు చేపట్టవచ్చు. విజయనగరంలో రామతీర్ధం, విశాఖ లోని అంబికా బాగ్ దేవాలయం దీనికి ఉదాహరణ. వివిధ రామాలయాలకు అనువంశిక ధర్మకర్తలు ఉన్నప్పటికీ మర్యాదపూర్వకంగా మంత్రులకు రామనవమి నాడు ప్రాధాన్యత ఉంటుంది అనేది ఎప్పుడూ జరిగేదే. విజయనగరం, గుంటూరు జిల్లాల్లో తామే శ్రీరామనవమి తలంబ్రాలు వేస్తామని, పట్టువస్త్రాలు తమ చేతుల మీదుగా సమర్పించి వేడుకలు జరిపిస్తామని అధికార వైఎస్సార్‌సీపీ నేతలు పట్టుబడుతున్నారు. తమకు అవకాశం దక్కదని తేలడంతో ఆలయాలకు సైతం తాళాలు వేయడం చూశాం. 


రెండేళ్ల తర్వాత వేడుకగా శ్రీరామనవమి ఉత్సవాలు: 
అసలే కోవిడ్19 వ్యాప్తి వల్ల గత రెండేళ్లపాటు ఏకాంతంగా శ్రీరామ పట్ఠాభిషేకాలు, కల్యాణోత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు అర్చకులు. ఈ ఏడాది కోవిడ్ తీవ్రత తగ్గడంతో భక్తుల సాక్షిగా శ్రీరామనవమి ఘనంగా జరపాలని ఏపీ ప్రభుత్వం, రామాలయాల అర్చకులు, అధికారులు, ధర్మకర్తలు భావిస్తున్నారు. సరిగ్గా అదేసమయంలో రాష్ట్రంలో అసలు మంత్రులే లేకుండా పోవడం విచిత్రంగా మారింది.  దీంతో  రాష్ట్రంలో శ్రీరామనవమి నాడు మంత్రులు లేని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి తన మంత్రివర్గం తో రాజీనామా చేయించే విషయంలో సీఎం జగన్ ఈ అంశాన్ని పరిగణనలోనికి తీసుకున్నారా అనే అంశంలో రాష్ట్రంలో చర్చ మొదలైంది. 


Also Read: Lucky Five : ఆ ఐదుగురు ఎవరు ? జగన్‌ కేబినెట్‌లో కొనసాగే వారెవరు ? 


Also Read: AP Power Cuts : ఏపీలో పరిశ్రమలకు విద్యుత్ కష్టాలు, 50 శాతం కోతలు, ఒక రోజు పవర్ హాలిడే