బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల విశాఖ కేజీహెచ్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. తాజాగా సోము వీర్రాజుకు మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.  కేజీహెచ్ పేరు మార్చడం కాదు, చేతనైతే విశాఖ రైల్వే జోన్ సాధించాలని బీజేపీ నేతలను ఎద్దేవా చేశారు. ఏపీకి రైల్వే జోన్ తేవడం చేతకాదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం చేతకాదు కానీ పేదల పాలిట గుడి లాంటి కేజీహెచ్ పేరు మారుస్తాననడం హాస్యాస్పదమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పేదల కోసం మరో ఆసుపత్రి లేక ఉన్నదాంట్లోనే మరో ప్లాంట్ కట్టించాలని సూచించారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర గల కేజీహెచ్ ప్రజలకు ఎంతో సేవ చేస్తుందని మంత్రి అన్నారు. ఇక కోవిడ్ కట్టడి కోసం ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటుందన్న అవంతి శ్రీనివాస్ ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.


Also Read:  ఏపీలో నైట్ కర్ఫ్యూ... థియేటర్లలో 50 శాతం సిట్టింగ్... కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష


విశాఖ రైల్వే జోన్ అంతులేని కథ


2019 ఫిబ్రవరిలో అప్పటి రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై అధికారిక ప్రకటన చేశారు. అదే ఏడాది మార్చిలో విశాఖలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ కూడా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వాల్తేరు డివిజన్‌లో కొంత భాగంతో ఒడిశాలోని రాయగడ్‌ డివిజన్‌గా, మరికొంత విజయవాడ డివిజన్‌లో కలుపుతామని వెల్లడించారు. ఆ తరువాత దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ప్రత్యేకాధికారి(ఓఎస్డీ)ని కేంద్రం నియమించింది. జోన్ పై డీపీఆర్‌ను తయారుచేసి రైల్వే బోర్డుకు, రైల్వే శాఖకు సమర్పించారు. కానీ దీనిపై అంతులేని కాలయాపన జరుగుతోంది. ఇప్పటి వరకు డీపీఆర్ ఆమోదం పొందలేదు. 


Also Read: సినిమా వాళ్లు బలిసికొట్టుకుంటున్నారు... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు !


ఎటూ తేల్చని కేంద్రం


కొత్త రైల్వే జోన్లపై ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఉన్న 17 రైల్వే జోన్లు, వాటి పరిధిలోకి వచ్చే డివిజన్ల సంఖ్యను లోక్ సభలో వివరించారు. జోన్ల వారీ వర్క్‌లోడ్‌, ట్రాఫిక్‌ తీరు, పరిపాలనా అవసరాలు, నిర్వహణ అంశాల మదింపు నిరంతర ప్రక్రియ అన్నారు. వీటి ఆధారంగా నిర్వహణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న జోన్లు, డివిజన్ల పరిధిలో సమయానుకూలంగా మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే అవసరాలు, రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని మరిన్ని జోన్లు మంజూరు చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం చేయలేదని పేర్కొన్నారు.


Also Read:  సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి