Ganta Srinivasa Rao Responds on His Resignation: దాదాపు మూడేళ్ల తర్వాత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Sriniavasa Rao) రాజీనామాను స్పీకర్ మంగళవారం ఆమోదించడం చర్చనీయాంశమైంది. అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా రాజీనామా చేయగా.. ఇప్పటివరకూ పెండింగ్ లో ఉంచిన స్పీకర్ ఇప్పుడు ఆమోద ముద్ర వేశారు. దీనిపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. మూడేళ్ల క్రితం రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదిస్తారా.? అని ప్రశ్నించారు. తాను అప్పుడు స్పీకర్ ను వ్యక్తిగతంగా కలిసి రాజీనామా ఆమోదించాలని చెప్పినా పెండింగ్ పెట్టారని.. ఇప్పుడు 3 నెలల్లో ఎన్నికలు ఉండగా ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా ఆమోదించే ముందు తన అభిప్రాయం తీసుకోవాలనే కనీస సంప్రదాయాన్ని కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఘటనతో జగన్ ఎంత పిరికివాడో అర్థమవుతోందని మండిపడ్డారు.


సీట్ల భయం కనిపిస్తోంది


సీఎం జగన్ (CM Jagan) లో రాజ్యసభ సీట్ల భయం కనిపిస్తోందని గంటా ఎద్దేవా చేశారు. 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ కు వ్యతిరేకంగా ఓటేస్తారనే ఆయనకు అనుమానంగా ఉందేమో అంటూ ధ్వజమెత్తారు. 'విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నా. రాజకీయ లబ్ధి కోసమే సీఎం జగన్ తన రాజీనామాను ఆమోదింపచేసి స్టీల్ ప్లాంట్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. జగన్ రెడ్డికి ఆత్మ గౌరవం ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడే ధైర్యం సీఎంకు ఉందా.?. అరాచక వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేయాలని నిర్ణయించుకున్నా. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా తనకున్న అవకాశాలపై న్యాయ సలహా తీసుకుంటా.' అని గంటా స్పష్టం చేశారు.


ఆ టైంలో రాజీనామా


2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021, ఫిబ్రవరి 12న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాంకు (Tammineni Seetharam) లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని అప్పట్లో స్వయంగా వెళ్లి స్పీకర్ ను కలిశారు. అప్పటి నుంచి గంటా రాజీనామా అంశం పెండింగ్ లో ఉండగా.. తాజాగా ఆయన రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.


అదే కారణమా.?


మార్చిలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మూడు రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల బలాల ప్రకారం ఈ మూడు స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడతాయి. కానీ ప్రస్తుతం సీఎం జగన్ అభ్యర్థుల కసరత్తు చేస్తున్నారు. ఈ కారణంగా  బదిలీ అయిన ఎమ్మెల్యేలు.. టిక్కెట్లు నిరాకరించిన ఎమ్మెల్యేలు టీడీపీ వైపునకు వెళ్తే ఓ రాజ్యసభ స్థానం దక్కించుకోవడం కష్టమవుతుందన్న అంచనాలో ఆ  పార్టీ వ్యూహకర్తలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే టీడీపీ బలాన్ని వీలైనంతగా తగ్గించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. గంటా రాజీనామాను ఆమోదించే ముందు ఆయన్ను ఒక్క సారి కూడా సంప్రదించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఇప్పుడు రాజీనామా ఆమోదించినా ఆమోదించకపోయినా పెద్దగా తేడా లేదు. ఎందుకంటే  నెల రోజులలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. కేవలం రాజ్యసభ ఎన్నికల దృష్టితోనే ఈ పని చేశారని టీడీపీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. 


Also Read: Actor Prudhvi Raj: 'నేను చంద్రబాబు, పవన్ వదిలిన బాణం' - ఎన్నికల్లో పోటీపై నటుడు పృథ్వీరాజ్ క్లారిటీ