విశాఖలోని రుషికొండపై నిర్మాణాల విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించింది. కాగా, రుషికొండలో అక్రమ నిర్మాణాలు, సీఎం క్యాంప్ ఆఫీసు ఏర్పాటుకు వ్యతిరేకంగా విజయవాడకు చెందిన పర్యావరణ వేత్త లింగమనేని శివరామ ప్రసాద్ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. హైకోర్టు, ఎన్జీటీల్లో కేసులు పెండింగ్ ఉన్నందున ఇప్పుడు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, రాజకీయాలకు ఇది వేదిక కాదని పేర్కొంది. 'సీఎంను రుషికొండకు వెళ్లొద్దంటారా.?' ఇందులో ప్రజా ప్రయోజనం ఏముంది.? అంటూ పిటిషనర్ ను సీజే ప్రశ్నించారు. ఇలాంటి కేసుల్ని ఉపేక్షించమని తేల్చిచెప్పారు. కాగా, పర్యావరణ అంశాలున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేసినా సీజేఐ అందుకు అనుమతించలేదు. పిటిషన్ సహేతుకంగా లేదన్న ధర్మాసనం డిస్మిస్ చేసింది. 


అక్రమ నిర్మాణాలని పిటిషన్


రుషికొండపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు వ్యతిరేకంగా లింగమనేని శివరామ ప్రసాద్ సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కోస్టల్ రెగ్యులేటరీ జోనుకు సంబందించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తుది విచారణ జరగాల్సి ఉందని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, ఏపీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం నిర్మాణాలకు జీవో ఇచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు. అక్టోబర్‌ 11న ఇచ్చిన జీవో 2015ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ విషయంపై కేసులు పరిష్కారమయ్యే వరకూ రుషికొండపై ఎలాంటి నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టునే ఆశ్రయించాలని సూచిస్తూ, పిల్ కొట్టేసింది.


హైకోర్టులో ఇటీవలే విచారణ


రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు నియమించిన కమిటీ తన నివేదికను ఇటీవలే న్యాయస్థానానికి సమర్పించింది. అనుమతికి మించి కట్టడాలున్నాయని, అక్రమంగా తవ్వకాలు, భవనాలు నిర్మించారని కోర్టుకు వెల్లడించింది. దీంతో మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మరో 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 29కి వాయిదా వేసింది.


విశాఖలో నిర్మాణాలపై విమర్శలు 


విశాఖలో రుషికొండపై పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సిద్ధమవుతున్న నిర్మాణాలపై విపక్షాలు గత కొంతకాలంగా విమర్శలు చేస్తూనే ఉన్నాయి. దాదాపు రూ.270 కోట్లతో భవనాలు నిర్మించినట్లు తెలుస్తోంది. రుషికొండపై 15 ఏళ్ల క్రితం హరిత బీచ్ పేరుతో రిసార్టులు నిర్మించి వీటిని పర్యాటకులకు అద్దెకు ఇచ్చేవారు. వీటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతులు తీసుకుందని సమాచారం.


అయితే, విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన సీఎం, డిసెంబర్ నుంటి తాను విశాఖ నుంచే పాలన సాగించనున్నట్లు ఇటీవలే వెల్లడించారు. అందులో భాగంగానే రుషికొండపై పర్యాటక శాఖ పేరుతో నిర్మించిన భవనాల్లో సీఎం కార్యాలయం, అక్కడికి సమీపంలోనే విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన మరో భవనంలో సీఎం నివాసం ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని లింగమనేని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


Also Read: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై షరతులు - హైకోర్టు కీలక తీర్పు