ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లకు రుణాలు తీసుకుని చెల్లించలేకపోయిన పేదల కోసం ఏపీ ప్రభుత్వం వన్ టైమ్‌ సెటిల్మెంట్ పథకం ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.   1983 నుంచి 2011 ఆగష్టు 15 మధ్య వివిధ ప్రభుత్వాల ద్వారా పొందిన ఇంటి స్థలాలు, ఇళ్లపై  లబ్దిదారులు అత్యధిక శాతం రుణాలు తిరిగి చెల్లించడం లేదు. దీంతో ఆ ఆస్తిని లబ్దిదారులు అమ్ముకోవడానికి అవకాశం ఉండటం లేదు. ఈ కారణంగా ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని వారి సొంత ఆస్తిగా మార్చి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వన్ టైమ్ సెటిల్మెంట్ పథకానికి మంత్రివర్గంలో ఆమోదించారు. ఈ నిర్ణయం వల్ల  46,61,737 మంది లబ్ధి పొందుతారని మంత్రి పేర్ని నాని ప్రకటించారు.  గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు మున్సిపాలిటీల్లో రూ.30 వేల వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద చెల్లించి పేదలు ఇళ్ల రుణాల నుంచి విముక్తి కావొచ్చని ప్రకటించారు.Also Read : కార్పొరేషన్ రుణాల లెక్క చెప్పండి .. ఏపీ ప్రభుత్వానికి కాగ్ లేఖ !
 
ఏపీలో మొదటి సారి 1983 నుంచి ప్రభుత్వం ఇళ్లను పేదలకు నిర్మిస్తోంది. అప్పట్లో ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.6వేలుగా నిర్ణయించారు. అందులో సగం రాయితీగా ఇస్తే మిగిలిన రూ.3వేలు హౌసింగ్‌ కార్పొరేషన్‌ రుణం రూపంలో ఇచ్చింది. ఆ రూ. మూడు వేల లబ్దిదారులు వాయిదాల రూపంలో చెల్లించాలి అలా 2011 వరకూ ప్రభుత్వాలు పేదలకు అలా సగం తాము భరించి.. సగం పేదలు వాయిదాల రూపంలో కట్టేలా ఇళ్లు ముంజూరు చేస్తున్నాయి. అయితే పేదలు ఇళ్లు తీసుకున్నారు కానీ ఆ వాయిదాలు కట్టలేకపోయారు. ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు.  ఇలా మొత్తం హౌసింగ్ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకుని ఇంకా చెల్లించని లబ్ధిదారుల సంఖ్య 46 లక్షలుగా ఉంది. మొత్తంగా ప్రభుత్వం ఇచ్చిన రుణం రూ.8,700 కోట్లుగా ఉంది. వారు రుణాలు చెల్లించకపోవడం వల్ల ఆ ఇళ్లపై పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు వారికి ధఖలు పడలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వన్ టైం సెటిల్మెంట్ కింద కట్టించుకుని వారికి వారి ఆస్తులను అమ్ముకునేలా హక్కులు కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది.Also Read : 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ! భక్తులకు సేవ చేస్తారా ? భక్తుల సొమ్ముతో సేవలు పొందుతారా ?
   
కేబినెట్‌ సమావేశంలో మరో 38 అంశాలపైనా చర్చించారు.  వైఎస్సార్‌ ఆసరా పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే కొత్తగా నిర్మిస్తున్న కాలనీల్లో గృహ నిర్మాణానికి రూ.35 వేల రుణ సదుపాయం, 3 శాతం వడ్డీకే రుణాల పథకానికి  మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్‌ ఆమోదించింది. మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. Also Read : ఏపీ పరిషత్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
 
పెన్షన్లను తగ్గిస్తున్న అంశంపై జరుగుతున్న వ్యతిరేక ప్రచారంపై మంత్రులకు సీఎం జగన్ ప్రత్యేకమైన సూచనలు చేశారు. పెన్షన్ల కోత విషయంలో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని సీఎం ఆదేశించారు. అర్హులకు మేలు జరిగేలా లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని ప్రజలకు వివరించాలన్నారు. ధనికులను కూడా పెన్షన్ లబ్దిదారుల జాబితాలో టీడీపీ ప్రభుత్వం చేర్చిందని వారిని మాత్రమే తొలగిస్తున్నామని జగన్ స్పష్టం చేశారు. అలాగే మంత్రులను  క్షేత్ర స్థాయిలో విస్తృత పర్యటనలు చేపట్టాలని మంత్రులను సీఎం జగన్ ఆదేశించారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పర్యటించేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని స్పష్టం చేశారు. 


Also Read : జగన్, విజయసాయిలకు ఊరట ... బెయిల్ రద్దు పిటిషన్లను కొట్టేసిన సీబీఐ కోర్టు !