ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్ విద్యాసంస్థ విలీనం వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలీన అంశాన్ని విద్యాసంస్థలకే వదిలిపెడుతూ నాలుగు ఆఫ్షన్లతో మార్గదర్శకాలు జారీచేసింది. ఎయిడెడ్‌ విద్యా సంస్థలకు గ్రాంటు నిలిపివేతపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన బాటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. విద్యాసంస్థల ఆస్తులతో సహా సిబ్బందిని లేదా సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించిన యాజమాన్యాలు తమ నిర్ణయంపై పునరాలోచించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అందుకు వెసులుబాటు కల్పించింది. శుక్రవారం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర ఓ మెమో జారీ చేశారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల విలీనానికి ఇప్పటికే మూడు ఐచ్ఛికాలు ఇవ్వగా తాజాగా అంగీకారాన్ని వెనక్కి తీసుకునే ఆఫ్షన్ అందులో చేర్చింది. పాఠశాల, జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలలకు ఈ మెమో జారీ చేశారు. 


Also Read: రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !


కొత్తగా మరో ఆఫ్షన్


1. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను యాజమాన్యులు ఆస్తులు, సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వ విద్యా సంస్థలుగా నిర్వహిస్తారు.
2. ఆస్తులు ఇవ్వకుండా కేవలం సిబ్బందిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు లిఖిత పూర్వక అంగీకారం తెలిపితే ఆ విద్యా సంస్థలను ప్రైవేటుగా సంస్థలుగా నిర్వహించుకోవచ్చు. 
3. ఎలాంటి అంగీకారం తెలపకుంటే నిబంధనల మేరకు ఎయిడ్‌ కొనసాగిస్తారు.
4. గతంలో ఆస్తులతో సహా సిబ్బందిని లేదా సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకరించిన యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు. యథావిధిగా ఎయిడెడ్‌ విద్యా సంస్థలుగా నిర్వహించవచ్చు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కొనసాగుతుంది.


Also Read: ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?


ఎయిడెడ్ సిబ్బంది వెనక్కి పంపుతారా...?


ఏపీలో 137 ఎయిడెడ్‌ కళాశాలల్లో 124 యాజమాన్యాలు ప్రభుత్వానికి సిబ్బందిని అప్పగించేందుకు అంగీకరించాయి. దీంతో కళాశాలల్లోని సిబ్బందిని అధికారులు ప్రభుత్వంలో విలీనం చేశారు. వీరికి ఇప్పటికే పోస్టింగ్‌లు ఖరారు చేశారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో యాజమాన్యాలు తమ సమ్మతిని వెనక్కి తీసుకుంటే సిబ్బందిని ఎలా సర్దుబాటు చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎయిడెడ్‌ సిబ్బందికి పోస్టులు ఇచ్చేందుకు రెగ్యులర్‌ సిబ్బందిని బదిలీ చేశారు. ఆ ఖాళీల్లో ఎయిడెడ్‌ సిబ్బందిని నియమించారు. తాజా నిర్ణయంతో ఎయిడెడ్‌ సిబ్బందిని వెనక్కి పంపుతారా లేక యథావిధిగా కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. పీహెచ్‌డీ విద్యార్హత ఉన్న ఎయిడెడ్‌ అధ్యాపకులకు విశ్వవిద్యాలయాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. సుమారు 342 మంది వరకు పీహెచ్‌డీ అర్హత కలిగి ఉంటే... వీరిలో 113 మందిని మూడేళ్ల పాటు డిప్యూటేషన్‌పై ఆంధ్ర యూనివర్శిటీకి కేటాయించారు. మిగతా వారిని రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలకు కేటాయించారు. 


Also Read: పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?


68.78శాతం యాజమాన్యాలు ఓకే


రాష్ట్రంలోని 2,249 ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో 68.78 శాతం యాజమాన్యాలు విలీనానికి అంగీకరించాయని ప్రభుత్వం తెలిపింది. 702 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని వెల్లడించింది. విలీనానికి అంగీకరించని ఎయిడెడ్‌ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి లేదని ఉన్నత విద్యా శాఖ స్పష్టం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,600 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రభుత్వంలో విలీనానికి అంగీకారించాయని ప్రభుత్వం వెల్లడించింది.


Also Read: కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత... విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి