ఎయిడెడ్ కళశాలల విలీన నిర్ణయం ఏపీలో ఆందోళనలకు దారితీస్తుంది. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో విద్యార్థుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని ఐడియల్‌ ఎయిడెడ్‌ కళాశాల విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. కళాశాలను ప్రైవేటీకరించవద్దని నిరసన చేశారు. సామర్లకోట రోడ్డులోని కళాశాల వద్ద నుంచి వందలాది మంది విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్‌కు చేరుకొన్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కలెక్టరేట్‌ వద్ద అడ్డంగా ఉంచిన బారీకేడ్లను తోసుకుని విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 


Also Read: పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?


విద్యార్థులపై ఫీజుల భారం


ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యం.సూరిబాబు, టి.రాజాలు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించే దిశగా పోలీసులు, అధికారులు ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై లాఠీఛార్జ్ చేసే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి తన సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఐడియల్ కళాశాలను ప్రైవేటుపరం చేస్తే భారీ స్థాయిలో విద్యార్థులపై ఫీజుల భారం పడే అవకాశం ఉన్నందున ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మూడు గంటలపాటు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు హోరున వర్షంలో సైతం ఆందోళన నిర్వహించారు. సుమారు రెండు వందల మంది విద్యార్థులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.


Also Read: కుప్పంలో గూండాలు, రౌడీలు, ఎర్రచందనం స్మగ్లర్లు .. భయపడకుండా ఓటేయాలని లోకేష్ పిలుపు !


భారీ వర్షంలోనూ ఆందోళన


కాకినాడ కలెక్టరేట్ లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన విద్యార్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులను అడ్డుకునేందుకు కలెక్టరేట్‌ పోలీసులు ప్రధాన ద్వారాన్ని మూసేశారు. దీంతో భారీ వర్షంలోనే విద్యార్థులు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన కొనసాగించారు. జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్‌ సత్తిబాబు విద్యార్థుల వద్దకు వచ్చి నిరసన విమరించాలని కోరారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. 


Also Read: రూ. 25వేల కోట్ల బకాయిలు డిస్కంలకు చెల్లించండి.. ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ లేఖ !


ప్రభుత్వం నిర్ణయం వివాదాస్పదం


ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం వివాదస్పందంగా మారింది. ఇన్నాళ్లు ఎయిడెడ్ విద్యాసంస్థల భారం ప్రభుత్వమే భరించేది. తాజాగా జీవో నెంబర్ 35,42, 50 ద్వారా ఎయిడెడ్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించంది. దీంతో ఏపీలోని అనేక కళాశాలలో విద్యార్థులు.. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు ఘర్షణకు దారితీస్తున్నాయి. అనంతపురం,కృష్ణా జిల్లాల్లో విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడంతో మరో మారు ఎయిడెడ్ పై సీఎం జగన్ నిర్ణయం అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో ఎక్కువ నష్టపోయేది ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులే. ప్రభుత్వానికి ఎయిడ్ ఆస్తులు స్వాధీనం చేస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు. అలా కాకుండా  ఎయిడెడ్ విద్యాసంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి స్వాధీనం చేయడం ఇష్టలేని ఎయిడ్ యాజమాన్యాలు మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. అలా కాకుండా తామే నడుపుకునేందుకు సిద్ధమైతే ఇక అవి ప్రైవేట్ విద్యాసంస్థలను తలపించేలా అధిక ఫీజులు వసూలు చేసే అవకాశాలే ఎక్కువ. అందుకే విద్యార్థులు అంగీకరించడంలేదు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


Also Read: ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?