Chandrababu oath taking on 12 June: అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం టైం మారింది అంటూ వచ్చిన సమాచారం అవాస్తవం. ముందు నిర్ణయించిన షెడ్యూల్  ప్రకారం జూన్ 12 తేదీ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఏపీ సిఎంవో (AP CMO) పేరుతో వచ్చిన ట్వీట్ లో ఉదయం 9.27 గంటలకు ప్రమాణ స్వీకారం అని తప్పుగా పోస్ట్ చేశారు. చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం 12న ఉదయం 11.27 గంటలకే చేస్తారని అని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు ఏపీ CMO తమ తప్పిదాన్ని సరిద్దుకుంది. ఆ ట్వీట్ డిలీట్ చేసి మరో ట్వీట్ లో అసలైన సమయం వివరాలు వెల్లడించింది.


ఏపీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై సిఎస్ సమీక్ష


విజయవాడ: ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా Chandrababu గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో శనివారం (జూన్ 8న) విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.


ఈ సమావేశంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు అవుతారని.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే విస్తృత మైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయంలో వివిఐపిలు, విఐపిలు తదితర ప్రముఖుల విమానాలు, హెలికాప్టర్లకు తగిన పార్కింగ్ కు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. అలాగే ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే కేంద, రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, వాహనాల పార్కింగ్ కు తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంకా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఇతర అంశాలపై సిఎస్ నీరసించి కుమార్ ప్రసాద్ సమీక్షించారు.






డిజిపి హరీశ్ కుమార్ గుప్త మాట్లాడుతూ.. విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.అదే విధంగా ఈకార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు యం.రవి చంద్ర,శశి భూషణ్ కుమార్, అదనపు డిజిపి ఎస్.బాగ్చి, టిఆర్ అండ్బి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, ఎపి జెన్కో సిఎండి చక్రధర్ బాబు, పౌరసరఫరాలు, ఉద్యానవన శాఖల కమీషనర్లు అరుణ్ కుమార్,శ్రీధర్, సిఆర్డిఏ కమీషనర్ వివేక్ యాదవ్, ఏలూరు రేంజ్ డిఐజి అశోక్ కుమార్, కృష్ణా, ఎన్టిఆర్ జిల్లాల కలెక్టర్లు డికె బాలాజీ, డిల్లీ రావు, సివిల్ కార్పొరేషన్ ఎండి వీరపాండ్యన్,  విజయవాడ పోలీస్ కమీషనర్ పిహెచ్ డి రామకృష్ణ, డిఐజి రాజశేఖర్ బాబు, డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ రమణ, ఎన్టిఆర్ జిల్లా జెసి సంపత్ కుమార్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్, కృష్ణా జిల్లా ఎస్పి ఎ.నయీమ్ హస్మి, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ ఎంఎల్ సి అశోక్ బాబు తదితర ప్రజా ప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.