YS Jagan Warning: వల్లభనేని వంశీ, నందిగం సురేష్లను వేధిస్తున్నారని వైఎస్ జగన్ అ్నారు. కూటమి ప్రభుత్వం, కొందరు అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మన టైం వస్తుంది "సినిమా చూపిస్తాం" అని వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాడేపల్లిలో సమావేశం అయ్యారు. ప్రస్తుతం రాక్షస ప్రభుత్వం నడుస్తోందన్నారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు. కేసులకు, జైళ్లకు బెదిరిపోకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలమని పార్టీ నేతలకు ధైర్యం చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందని.. తిరువూరు వంటి ప్రాంతాల్లో వైసీపీకి సంఖ్యాబలం ఉన్నప్పటికీ, టీడీపీ పోటీకి దిగడం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ ఆధిక్యం ఉంటే ఎన్నికలను నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైసీపీ వారిని అరెస్టులు చేస్తూ, టీడీపీ వారిని వదిలేస్తున్నారని అన్నారు.
కొడితామంటే కొట్టించుకోవాలని జగన్ సలహా ఇచ్చారు. అయితే ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి, కొడతానంటే కొట్టమనండి. కానీ, మాకూ సమయం వస్తుంది. అప్పుడు అన్యాయాలు చేసిన ప్రతి ఒక్కరికీ సినిమా చూపిద్దామన్నారు. రిటైర్ అయిన వారిని కూడా లాక్కొచ్చి తీరుతామని.. . దేశం విడిచి పారిపోయినా రప్పిస్తామని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు నాటిన విత్తనాలే ప్రస్తుత పరిస్థితులకు కారణమని, మహిళలని కూడా చూడకుండా నెలల తరబడి జైళ్లలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కేసులో బెయిల్ వస్తే, వెంటనే మరో కేసు నమోదు చేస్తున్నారని, వల్లభనేని వంశీ విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడైన నందిగం సురేష్ను కూడా అన్యాయంగా నెలన్నరకు పైగా జైల్లో ఉంచి, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపారని అన్నారు.
జగన్ 2.0లో కార్యకర్తలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్నారు. కచ్చితంగా వైసీపీ కార్యకర్తే నంబర్ వన్ అవుతాడని, కార్యకర్తలకు అండగా నిలబడతామని ఆయన కార్యకర్తలకు చెప్పారు.