తమిళనాడులోని మదురైకు చెందిన ఓ యువకుడు తన సైకిల్‌ను ఇ-బైక్‌గా మార్చేసి ఔరా అనిపించాడు. అంతేకాదు, ఈ బ్యాటరీతో నడిచే ఈ సైకిల్‌కు ప్రత్యేకంగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదంటూ ఆశ్చర్యపరిచాడు. 


మధురైలో MSc చదువుతున్న ధనుష్ కుమార్.. తన చెల్లి సైకిల్‌పై ఈ ప్రయోగం చేశాడు. రోజు ఆమె కాలేజ్‌కు వెళ్లడానికి పడుతున్న అవస్థలు చూసి.. ఆమె సైకిల్‌ను బ్యాటరీ సైకిల్‌గా మార్చేయాలని అనుకున్నాడు. ఎట్టకేలకు దాన్ని ‘ఇ-బైక్’గా మార్చేసి చెల్లికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ ఇ-బైక్ గంటకు 40 కిమీల వేగంతో దూసుకెళ్తుందని ధనుష్ చెప్పాడు. ఫుల్‌గా ఛార్జింగైతే 40 కిమీలు వరకు వెళ్లవచ్చని పేర్కొన్నాడు. అయితే, ఇందుకు పదే పదే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదని, ఛార్జర్‌ను కూడా వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదని తెలిపాడు. అలా ఎలా సాధ్యమని అడిగితే.. ఈ సైకిల్ దానికదే ఛార్జ్ అవుతుందని చెప్పాడు. సైకిల్ తొక్కేప్పుడు బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుందని తెలిపాడు. 


“ప్రపంచంలో సంప్రదాయేతర ఇంధనానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రజలు రోజురోజుకు పర్యావరణ అనుకూల వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, నేను మొదట సౌరశక్తితో నడిచే బైక్‌ను కనుగొన్నాను. ఇప్పుడు, నా సోలార్ బైక్ కంటే మూడు రెట్లు ఎక్కువ సమర్థవంతమైన ఇ-బైక్‌ని రూపొందించాను. ఈ సైకిల్‌కు పెడల్ కూడా ఉంటుంది. అందువల్ల, మీరు దానిని పెడల్ తొక్కినప్పుడు బ్యాటరీ దానికదే రీఛార్జ్ అవుతుంది. ఇందుకు కార్లలో ఉపయోగించే ఆల్టర్నేటర్లను ఉపయోగించాను’’ అని ధనుష్ తెలిపాడు.


Also Read: డయాబెటిస్‌ బాధితులకు ఈ సమ్మర్ పెద్ద సవాలే, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!


“ఇ-బైక్‌లోని పెడలింగ్ చైన్‌కు ఛార్జర్‌ను జోడించాను. బ్యాటరీ ఎప్పుడూ ఛార్జింగ్‌లో ఉంటుంది కాబట్టి, ప్రయాణానికి అంతరాయం వాటిల్లే అవకాశమే ఉండదు. ఒకసారి ఛార్జ్ చేస్తే చాలు. ఎలాంటి అంతరాయం లేకుండా 40 కి.మీ వరకు ప్రయాణించగలదు. 40 కి.మీ తర్వాత ఛార్జ్ తగ్గితే, వాహనం ఆటోమేటిక్‌గా పెడలింగ్ మోడ్‌కి మారుతుంది. సౌరశక్తితో నడిచే బైక్‌లో సోలార్ బ్యానర్‌ను అమర్చడానికి చాలా స్థలం పట్టింది. కానీ, ఎక్కువ స్థల వినియోగం లేకుండా ఈ ‘ఈ-బైక్’ తయారు చేశాను. ఇది పర్యావరణానికే కాకుండా శరీరానికి కూడా మేలు చేస్తుంది’’ అని కుమార్ పేర్కొన్నాడు. ప్రస్తుతం కుమార్ తన ఈ-బైక్‌ను వాణిజ్య వినియోగంలోకి తీసుకురావడానికి కోయంబత్తూరు జిల్లాలోని ఒక ప్రైవేట్ కంపెనీతో చర్చలు జరుపుతున్నాడు. తమిళనాడు గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి అన్బరసన్ ధనుష్ ప్రయత్నాన్ని అభినందించారు.


Also Read: శృంగారం తర్వాత పురుషులకు నిద్ర ఎందుకు వస్తుంది? దీని వెనుక ఇంత కథ ఉందా!