ఈ రోజు కింది స్థాయిలోని గాలులు ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో  పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు.


హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో ఉత్తర, ఈశాన్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 17.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 58 శాతంగా నమోదైంది.


మెున్నటి వరకు తెలంగాణలో విపరీతమైన ఎండలు ప్రజలను ఇబ్బంది పెట్టగా.. తాజాగా చలికాలం ప్రారంభమైంది. రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 


తెలంగాణలో ఈసారి విభిన్న వాతావరణపరిస్థితులు నెలకొన్నాయి. ఎండకాలం ప్రారంభం మాదిరిగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. గత కొద్ది రోజులుగా పగటిపూట ఉష్టోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇది ఎండాకాలమా? శీతాకాలమా ? అన్న అనుమానం వచ్చే విధంగా మధ్యాహ్నం సమయంలో 33-36 డిగ్రీ సెంటిగ్రేడ్ల మధ్య ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నవంబర్ 15 వరకు ఎండల తీవ్రత ఉంటుందని ముందుగా ఐఎండీ అంచనా వేసింది. వచ్చే రెండు మూడ్రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.


ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం
తేలిక పాటి నుండి ఒక మోస్తరు చినుకులు లేదా జల్లులు కొన్ని చోట్ల  కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో కూడా తేలిక పాటి నుండి ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు.


పెరగనున్న చలి
‘‘వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా బంగ్లాదేశ్ వైపుగా వెళ్తోంది. దీని వలన ఉత్తర భారత దేశం నుంచి దిగువకు వస్తున్న పొడి గాలులు నేరుగా మన వైపుగా వస్తున్నాయి. దీని వలన రాష్ట్రంలోని అన్ని భాగాల్లో రాత్రి పూట చలి తీవ్రత బాగా పెరగనుంది. రాయలసీమ​, తెలంగాణలలో బాగా చలి తీవ్రత పెరగనుంది. ఈ పరిస్ధితి మరో మూడు రోజుల పాటు కొనసాగనుంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.