Telangana News: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దూరం చేశారన్న కారణంతో అత్తమామపై పగ పెంచుకున్నాడో వ్యక్తి. బుధవారం రాత్రి ఇంటిపై దాడి చేసి కత్తితో తెగబడ్డాడు. అత్తమామ చంపేశాడు. వరంగల్ జిల్లాలో జరిగిన దారుణం సంచలనంగా మారింది. 


వరంగల్ జిల్లా నర్సంపేటలోని చెన్నారావుపేటలో 16 చింతల తండాలో అర్థరాత్రి దారుణం జరిగింది. మేకల బన్నీ అనే యువకుడు అర్ధరాత్రి అత్తవారింటిపై పడి అత్తమామను హత్య చేశాడు. బన్నీ చేసిన పాశవిక దాడిలో గాయాల పాలైన అత్త సుగుణ స్పాట్‌లోనే చనిపోయారు. మామ శ్రీను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అక్కడే ఉండి బన్నీ దాడిని అడ్డుకున్న కుమార్తె, కుమారుడు గాయాలతో చికిత్స పొందుతున్నారు. 


మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ వాసి అయిన మేకల బన్నీ... శ్రీనివాస్‌ కుమార్తె దీపిక ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. వీళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో వాళ్లిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత బన్నీ తన అసలు స్వరూపాన్ని చూపించాడు. రోజూ కొట్టడం తిట్టడంతో దీపిక విసిగిపోయింది. 


తాను మోసపోయినట్టు గ్రహించిన దీపిక విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేసింది. కుమార్తె పడుతున్న బాధలు తెలుసుకున్న సుగుణ, శ్రీనివాస్ పెద్దలతో పంచాయితీ పెట్టారు. తాను అతనితో ఉండలేనని... రోజూ వాడి పెట్టే టార్చర్ పడలేనంటూ దీపికి చెప్పేసింది. 


దీంతో పెద్దలు ఇద్దర్నీ వేరువేరుగా ఉండాలని తేల్చి చెప్పారు. తన భార్య తనకు కాకుండా చేసింది అత్తమామే అని పగ పెంచుకున్నాడు బన్నీ. లేని పోనివన్నీ చెప్పి దీపికను తన నుంచి దూరం పెట్టారని ఆగ్రహంతో ఊగిపోయాడు. కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న బన్నీ బుధవారం రాత్రి ఒక్కసారిగా అత్తమామ ఇంటిపై పడ్డాడు. 


దీపికను తనకు కాకుండా చేశారని కోపంతో రగిలిపోయాడు. ముందే తెచ్చుకున్న కత్తితో ముందు అత్తమామను నరికేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన కుమార్తె దీపిక, కుమారుడు మధన్‌పై కూడా దాడి చేశాడు. ఈ దారుణ దాడిలో అత్త సుగుణ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలు పాలైన శ్రీనివాస్, దీపిక, మధన్‌ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్చారు. 


ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ కూడా మృతి చెందాడు. మిగతా ఇద్దరు అదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బన్నీ పట్టుకున్నారు.