11th  July 2024 News Headlines in Telugu For School Assembly: 
1. తల్లికి వందనం, స్టూడెంట్ కిట్స్‌ పథకాల లబ్ధిదారులకు ఆధార్‌ తప్పని సరి చేసింది ప్రభుత్వం. ఆధార్‌ లేకుంటే ప్రభుత్వం గుర్తించిన కార్డులతో పథకాలకు లబ్ధి తాత్కాలికంగా పొందొచ్చు. ఏటా తల్లికి వందనం పథకంతో విద్యార్థుల తల్లికి లేదా సంరక్షకులకు 15000 ఇవ్వనుంది. 
2. భారత్‌ పెట్రోలియం రిఫైనరీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. బీపీసీఎల్‌ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చి చంద్రబాబుతో చర్చలు జరిపింది. రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్లతో ఏర్పాటు చేసే ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించింది. అక్టోబరు నాటికి నివేదికతో వస్తామని వివరించింది. 


3.జాతీయ రహదారులకోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. NHAI పరిధిలో రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై రేవంత్ సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. 
4. ప్రభుత్వ ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో గోకుల్చంద్ర, రాహుల్ చంద్ర మెమోరియల్ చారిటబుల్స్ ట్రస్ట్, సహృదయ సాహితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిచిన 'విజయ నిఘంటు చంద్రిక నిఘంటువు ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. న్యాయ వాదోపవాదాలు, తీర్పులు కూడా మాతృభాషలోనే ఉండాలని వెంకయ్య అన్నారు.


జాతీయ వార్తల్లోని ముఖ్యాంశాలు
5. విద్యార్థులపై భారం తగ్గించేందుకు టోఫెల్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఈ పరీక్ష రెండు గంటల్లోపే నిర్వహించాలని నిర్ణయించినట్లు టోఫెల్‌ సంస్థ గ్లోబల్‌ హెడ్‌ ఒమర్‌ చిహాన్‌ తెలిపారు. విద్యార్థులు ఇష్టంగా మరింత ప్రశాంతంగా పరీక్ష రాయాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 


6. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ అభియోగపత్రం దాఖలు చేసింది. ఈ కుంభకోణంలో అందిన రూ.100 కోట్లలో కొంత భాగాన్ని కేజ్రీవాల్‌ స్వయంగా వాడుకున్నారని ఈడీ ఆరోపించింది. అలా వచ్చిన నిధులతోనే గోవాలోని రిచ్‌ హోటల్‌లో బస చేశారని పేర్కొంది. 


అంతర్జాతీయ వార్తలు
7. యుద్ధానికిది సమయం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మర్‌తో చర్చలు జరిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలపై చర్చించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు.


రిసెర్చ్‌
8. జీవన శైలిలో వస్తున్న మార్పులు... టీనేజర్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని 71 సూళ్లల్లోని విద్యార్థులపై అధ్యయనం చేశారు. జంక్ ఫుడ్, ఆల్కహాల్, పొగాకు వాడకం.. మద్యం తాగడం యువతపై పెను ప్రభావం చూపుతోందని ఈ అధ్యయనం తేల్చిచెప్పింది.


క్రీడలు
9. జింబాబ్వే పర్యటనలో భారత్‌ క్రికెట్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 182 పరుగుల స్కోరు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ అద్భుతంగా రాణించారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే బాగానే పోరాడింది. అయితే 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. 


మంచిమాట
10. ఎంత గొప్ప స్థానానికి చేరినా విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది... సర్వేపల్లి రాథాకృష్ణన్‌