మహబూబాబాద్ జిల్లాలో మరిపెడ మండలంలో 20 దున్న పోతులను కాళీకా మాతకు బలి ఇచ్చిన ఘటన చర్చనీయాంశం అవుతోంది. ఏకంగా 20 దున్నల తల నరికి దేవికి బలి ఇచ్చారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మరిపెడ మండలంలోని ఓ తండాలో ఈ జంతు బలుల వ్యవహారం సంచలనంగా మారింది. దున్నల తలలు తెగిపడేలా భయంకరంగా నరికేశారు. అత్యంత పాశవికంగా దున్నల తలలు నరకడంపై జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు. 


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాలోని చాలా తండాల్లో ఇలా పెద్ద ఎత్తున జంతు బలులు ఇచ్చే సాంప్రదాయం చాలా ఏళ్ల నుంచి కొనసాగుతోంది. కనీసం 100 ఏళ్ల నుంచి తండాల వాసులు ఇలాంటి జంతు బలులను ఐదేళ్లకు ఓ సారి చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు కూడా ఆ ఆనవాయితీ ప్రకారమే జరిగింది. 


తండా వాసుల గ్రామ దేవతగా కొలిచే కాళీ మాతకు ప్రతి 5 ఏళ్లకు ఒక సారి 20 దున్నపోతులను బలి ఇస్తుంటారు. ఈ ఏడాది కూడా గత శనివారం అర్ధ రాత్రి వేళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాళీ మాతకు లంబాడా సంప్రదాయంలో పూజలు చేపట్టి 20 దున్నపోతుల తలలు నరికి మెడలో హారంగా సమర్పిస్తారు. పూజ ముగిసిన అనంతం ఆ దున్న పోతుల తలలను, కాళ్ళను మాత్రమే అదే ప్రదేశంలో గుంత తీసి అందులో పాతి పెడతారు. ఈ దున్నపోతుల మిగతా దేహాలను ఆ మాంసం తినేవారికి ఇస్తుంటారు. 


అతి రహస్యంగా ఈ కార్యక్రమం
ఈ జంతు బలుల కార్యక్రమాన్ని తండా వాసులు అత్యంత రహస్యంగా కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే నిర్వహిస్తారు. అది కూడా ఆడవారికి అనుమతి లేదు. గ్రామంలోని మగవారు మాత్రమే ఈ పూజల్లో పాల్గొంటారు. ఇతరులను గ్రామంలోకి అనుమతించరు. అర్థ రాత్రి వేళల్లో జంతు బలి చేపడతారు. అక్కడికి ఎలాంటి ఫోటోలు గానీ వీడియోలను తీసేందుకు ఎవరికి అనుమతి ఇవ్వరు. అసలు ఫోన్లు, కెమెరాల్లాంటివి అక్కడికి అనుమతించరు.