Draupadi Murmu TS Visit: రామప్ప గార్డెన్‌లో జర్మన్‌ టెంటును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. విశాలమైన స్టేజీని నిర్మించారు. ఇక్కడ సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ప్రసాద్‌ పథకంలో భాగంగా కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖల ఆధ్వర్యంలో రామప్ప ఆలయ అభివృద్ధికి రూ.62 కోట్లతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండు సేఫ్‌ హౌజ్‌లను ఏర్పాటు చేశారు. ఒకదానిలో కార్డియాలజిస్టు, జనరల్‌ ఫిజీషియన్‌, అనస్తీషియా డాక్టర్‌, ఆక్సిజన్‌ సిలిండర్స్‌ అందుబాటులో ఉంటాయి. మరో సేఫ్‌హౌస్ లో కంటి వైద్యుడు, జనరల్‌ మెడిసిన్‌, అనస్తీషియా, పిల్లల వైద్యులతోపాటు ఒక అత్యవసర అంబులెన్స్‌, రక్త నిధి కేంద్రం, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, ఎంఎన్‌వో ఇలా మొత్తం 30 ఉంటారు. వారందరినీ జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య పర్యవేక్షిస్తారు. 




రామప్ప పరిసరాల్లో కేంద్ర భద్రత సిబ్బంది భారీ భద్రతా ఏర్పాట్లు


జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ జి.పాటిల్‌ ఆధ్వర్యంలో రాష్ట్రపతి పర్యటనకు 547 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేంద్ర భద్రతా సిబ్బంది, ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బందితో కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి తప్పిదాలు జరుగకుండా మంగళవారం ఉదయం, సాయంత్రం హెలిప్యాడ్‌ స్థలం నుంచి ఆలయం వరకు వాహన శ్రేణితో రిహార్సల్‌ చేశారు. ఐజీ నాగిరెడ్డి, ఇంటలీజెన్స్‌ ఎస్పీ నారాయణనాయక్‌, 5వ బెటాలియన్‌ అధికారులు రామప్పకు చేరుకుని మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఎయిర్‌ ఫోర్స్‌ అదికారులు రామప్పలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ స్థలంలో ల్యాండింగ్‌ రిహార్సల్‌ చేశారు. చుట్ట ప్రక్కల ప్రదేశంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు.




చింతలపల్లి కళాకారులతో కొమ్ము నృత్యం


ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ కొమ్ము నృత్య కళాకారులకు అరుదైన అవకాశం లభించింది. రాష్ట్రపతి సమక్షంలో వారు ప్రదర్శన ఇవ్వనున్నారు. చిన్నబోయినపల్లికి సమీపంలో ఉన్న గూడానికి చెందిన కళాకారులను ఐటీడీఏ పీవో అంకిత్‌ పర్యవేక్షణలో రామప్పకు తీసుకువచ్చి రిహార్సల్స్‌ చేశారు.


కేంద్ర, రాష్ట్ర మంత్రుల హాజరు..


రాష్ట్రపతి పర్యటనలో పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రముఖులు పాల్గొననున్నారు. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివా‌స్ గౌడ్‌, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ పోచంపెల్లి శ్రీనివాస్‌ రెడ్డిలు హాజరుకానున్నారు. హెలిప్యాడ్‌ వద్ద రాష్ట్రపతికి ఆహ్వానం పలికే బృందంలో పాలంపేట సర్పంచ్‌ డోలి రజిత, జడ్పీటీసీ గై రుద్రమదేవి, ఎంపీపీ బుర్ర రజిత, వైస్‌ ఎంపీపీ మునిగంటి తిరుపతి రెడ్డిలకు అవకాశం కల్పించగా వారందరికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టర్‌, ఐటీడీఏ పీవోతోపాటు పలువురు అధికారులకు కొవిడ్‌ పరీక్షలు జరిపారు. కాన్వాయ్‌లో విధులు నిర్వర్తించే డ్రైవర్‌లకు  పరీక్షలు చేశారు.


అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. 


రామప్ప ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్‌’ (పిలిగ్రిమేజ్‌ రీజువినేషన్‌ స్పిరిచువల్‌ ఆగ్‌మెంటేషన్‌ డ్రైవ్‌) పథకంలో భాగం గా రూ.61.99 కోట్లను మంజూరు చేసింది. బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రామప్ప పర్యటనలో అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ పథకంలో భాగంగా రామప్పలో పలు అభివృద్ధి పనులు చేయనున్నారు. 4డీ మూవీ హాల్‌, కాకతీయ తోరణం ఆర్చీ, గార్డెన్‌, ప్లేగ్రౌండ్‌, వాహనాల పార్కింగ్‌, హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌, మరుగుదొడ్లు నిర్మాణం, బయోటాయిలెట్స్‌, రహదారుల విస్తరణ, లైటింగ్‌, సిట్టింగ్‌ బెంచీలు, సీసీ కెమెరాలు, సర్వేలైన్స్‌ సిస్టంలు ఏర్పాటు, బ్యాటరీ వాహనాల చార్జింగ్‌ పాయింట్‌, సోలార్‌ విద్యుత్‌ పవర్‌ప్లాంట్‌, సరస్సులో జెట్టి బోట్స్‌ తదితర పనులు చేయనున్నారు.