- ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ 
- ఎఫ్ ఆర్ ఓ మృతిపై తీవ్ర దిగ్బ్రాంతి, విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
- హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ కి ఆదేశం 
- రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం 
- ప్రభుత్వ ఉద్యోగులపై దాడుల సహించం 
- అధికార లాంఛనాలతో శ్రీనివాస్ అంత్యక్రియలు జరపాలని సీఎం ఆదేశం 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, పోడుభూమి సాగుదారుల దాడిలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు కుటుంబానికి సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దోషులకు కఠినంగా శిక్షలు పడేలా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరణించిన ఎఫ్ ఆర్ వో కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో ఉంటే ఏవిధంగానైతే జీతభత్యాలు అందుతాయో.. ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని, రిటైర్ మెంట్ వయస్సువరకు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.






ఎఫ్ ఆర్ వో పార్థివ దేహానికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సిఎస్ సోమేశ్ కుమార్ ను సిఎం కేసీఆర్ ఆదేశించారు. అటవీశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు ఎఫ్ ఆర్ వో అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పై దాడులను ఏమాత్రం సహించబోమని సిఎం స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం అండగా వుంటుందని ఎలాంటి జంకు లేకుండా తమ విధిని నిర్వర్తించాలని,ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారు.


అసలేం జరిగిందంటే.. 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం జరిగింది. ఓ ప్రభుత్వ అధికారి గ్రామస్థుల ఆగ్రహానికి గురై ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామం ఎర్రబోడులో ప్లాంటేషన్‌ మొక్కలను పోడుభూమి సాగుదారులు నరుకుతుండటంతో వాటిని అడ్డుకునేందుకు ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే మొక్కలను నరకవద్దని గుత్తికోయలను హెచ్చరించడంతో గుత్తికోయలు ఆగ్రహం చెందారు.


వారు సహనం  కోల్పోయి ఒక్కసారిగా వేట కొడవళ్లతో ఫారెస్ట్ రేంజ్‌ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి తీవ్ర గాయాల పాలు అయ్యారు. వెంటనే తోటి సిబ్బంది ఆయన్ను చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటి వరకు ఫారెస్ట్‌ అధికారులు చేసిన దాడిలో గిరిజనులకు గాయాలైనప్పటికీ తొలిసారిగా సాగుభూమిదారులు దాడి చేయడం, ఈ దాడిలో రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు మృతి చెందడంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.