Siddipeta News: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ టూవీలర్ వాహనాల పార్కింగ్ స్థల సమీపంలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఉదయం ప్రయాణ ప్రాంగణానికి దగ్గరగా తోపుడు బండి పెట్టేందుకు ఓ వ్కక్తి వెళ్లగా.. బాంబులు పేలిన శబ్దం వచ్చింది. అది విన్న తోపుడు బండి యజమాని వెంటనే విషయాన్ని ఆర్టీసీ సిబ్బందికి తెలియజేశాడు. వాళ్లు పోలీసులకు తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ సతీష్.. సిబ్బందితో కలిసి బాంబు స్క్వార్డుతో తనిఖీలు చేపట్టారు. తనిఖీలో ఐదు నాటు బాంబులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. నాటు బాంబులు అక్కడికి ఎలా వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను ఎస్సై శ్రీధర్ పరిశీలిస్తున్నారు.ఊర పందుల కోసం నాటు బాంబులు పెట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాటు బాంబులు ఉన్న వైపు ప్రజలు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుగా తాడు కట్టారు. అంతే కాకుండా అటువైపును ఎవరినీ వెళ్లనీయకుండా కాపలా కాస్తున్నారు. 


ఇటీవలే ఏపీలోని కర్నూలు జిల్లాలో నాటు బాంబుల కలకలం.. 


కర్నూలు జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. నాటు బాంబుల పేరు చెబితే స్థానిక రైతులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా పత్తికొండలో ఓ రైతు పొలంలో నాటు బాంబులు దొరికాయి. ఒకే ప్రాంతంలో గత నెల రోజుల క్రితం పత్తికొండ అటవీ ప్రాంతంలో పొలాల్లో పని చేసుకుంటున్న మహిళకు నాటు బాంబులు దొరికాయి అవి బాంబులా కాదా అని తెలుసుకునే ప్రయత్నం మహిళలు చేశారు. ఆ ప్రయత్నంలోనే ఒక మహిళ చేయి కోల్పోవాల్సి వచ్చింది.


పొలానికి వెళ్లాలంటే రైతులకు భయం భయం 
నాటు బాంబుల ఘటనపై కేసు నమోదు చేసుకున్న  పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి పత్తికొండ నగరంలో ఓ ఇంట్లో 26 నాటు బాంబులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి  అదే అటవీ ప్రాంతంలో పొలాల్లో ఒక నాటుబాంబు దొరకడం రైతులను కలవరపెడుతోంది. పొరపాటున నాటు బాంబుల మీద కాలుపెట్టినా, తాకినా అవి పేలతాయని ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణ సమీపంలో కర్నూల్ రోడ్డు లో ఉన్న శ్రీ శక్తి భవనం వెనకవైపు ఉన్న పొలాలలో నాటు బాంబు దొరకడం కలకలం రేపింది. పత్తికొండ పట్టణానికి చెందిన రైతు కొలిమి జాకీర్ పొలంలో నాటు బాంబు కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు.


కవర్‌లో చుట్టి పడేశారు ! 
పొలాలలో నాటు బాంబు ఉండడంతో చుట్టుపక్కల రైతులు, రైతు కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు పొలాలకు వెళ్లాలంటే భయపడి పోతున్నారు. కొలిమి జాకీర్ తన తల్లితో కలిసి రోజువారీ గానే ఉదయాన్నే పొలానికి వెళ్లగా పొలంలో నీలిరంగు కవర్ పడి ఉండటాన్ని జాకీర్ తల్లి చూడగా జాకీర్ నాట్ బాంబు లాగా ఉందని గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకొని నాటు బాంబును గుర్తించి దానిని నీటిలో వేసి నిర్వీర్యం చేశారు. 


తరచుగా అదే ప్రాంతంలో నాటు బాంబులు 


అదే ప్రాంతంలో రెండుసార్లు పొలాలలో నాటు బాంబులు లభ్యం కావడంతో రైతులు రైతు కూలీలు పొలాలలో పనికి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ బాంబుల వెనుక ఎవరి హస్తం ఉందో పోలీసులు గుర్తించాలని రైతులు కోరుతున్నారు. గతంలో పట్టణంలో ఒక ఇంటిలో ఉంచిన బాంబులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. కానీ మరొకసారి పట్టణ సమీపంలోని పొలాలలో బాంబులు దొరకడంతో వన్యప్రాణులు చంపడానికి బాంబులు పెట్టారా లేక ఎవరినైనా చంపడానికి బాంబులు పెట్టారా అనేది తెలియాల్సి ఉంది.