టాలీవుడ్ లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న సినిమాల్లో మెగా స్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమా ఒకటి. చిరంజీవి నుంచి సినిమా వస్తుంది అంటేనే మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై  భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. సినిమాలో బాస్ పార్టీ సాంగ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది మూవీ టీమ్. 


ఇక ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవిశ్రీప్రసాద్ గతంలో బాస్ పార్టీ సాంగ్ కు రిలీజ్ కు సంబంధించిన పోస్ట్ చేశారు. తాజాగా ఈ పాటు 33 సెకన్ల నిడివి గల ప్రోమోను అధికారికంగా విడుదల చేశారు. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ మార్క్ కనిపించేలా మాస్ బిట్స్, దేవి డైలాగ్స్ తో మొదలైంది. ప్రోమో ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో బాస్ పార్టీ పాటపై ఆసక్తి పెరిగింది. 


దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన పాటలు యూత్ ను ఉర్రూతలూగిస్తాయి. మాస్ పల్స్ పక్కాగా తెలిసిన దేవి ఈ సినిమాలోనూ అదే మాస్ బిట్స్ తో అదరగొట్టాడు. అంతేకాదు దేవి-చిరు కాంబో లో వచ్చిన ఆల్బమ్స్ ఎవర్ గ్రీన్ హిట్ గా నిలుస్తాయి. 'శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్', 'శంకర్ దాదా జిందాబాద్', 'ఖైదీ నెం 150' సినిమాల్లో పాటలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. తాజాగా 'వాల్తేరు వీరయ్య' సినిమాలో కూడా దేవి మ్యాజిక్ చేసినట్టే కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బాస్ పార్టీ ఫుల్ సాంగ్ ను నవంబర్ 23వ తేదీ సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


'వాల్తేరు వీరయ్య' సినిమా టైటిల్ అందరినీ ఆకట్టుకుంటోంది. మొదట రిలీజ్ చేసిన పోస్టర్, ఫస్ట్ లుక్ వీడియోలకు విపరీతమైన స్పందన వచ్చింది. అందులోనూ సినిమాలో చిరంజీవిది పక్కా మాస్ క్యారెక్టర్ లా కనిపించడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. చిరంజీవి ఇలా లుంగీతో మాస్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు చేసి చాలా కాలం అయిందనే చెప్పాలి. అందుకే వింటేజ్ చిరంజీవిని మళ్ళీ తెరపై చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. 


మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా తన జోరు కొనసాగిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు చిరు. 'సైరా' తర్వాత 'ఆచార్య' సినిమాను విడుదల చేశారు. తర్వాత మళ్ళీ 'గాడ్ ఫాదర్' ను రిలీజ్ చేసి మంచి హిట్ అందుకున్నారు. మళ్ళీ అదే స్పీడ్ లో 'వాల్తేరు వీరయ్య' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాతో చిరు చాలా కాలం తర్వాత ఔట్ అండ్ ఔట్ మాస్ లుక్ లో కనిపించనున్నారు.


అంతేకాకుండా ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎప్పుడో 'అన్నయ్య' సినిమాలో రవితేజ చిరంజీవి కలసి నటించారు. మళ్ళీ ఇన్నేళ్లకు వీరిద్దరూ స్క్రీన్ పై కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది మూవీ టీమ్. మైత్రి మూవీ మేకర్స్ భారీ ఎత్తున సినిమాను నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించనుంది.


Read Also: ‘బేబీ’కి రౌడీ బాయ్, రష్మిక మద్దతు, టీజర్ బాగుందంటూ ప్రశంసలు!