వరంగల్ జిల్లా మొత్తం రుణాల పంపిణీ లక్ష్యం రూ.2 వేల 744 కోట్లు కాగా రూ.4 వేల 36 కోట్ల రుణాలు ఇచ్చి లక్ష్యానికి మించి రెట్టింపు రుణాలు ఇచ్చిన బ్యాంకర్లను జిల్లా అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు. వ్యవసాయ, పరిశ్రమల రుణాలు అధికంగా ఉండటం అభినందనీయమన్నారు. వ్యవసాయ రుణాల లక్ష్యం 1233.13 కోట్లు కాగా 1350.40 కోట్ల రుణాలు, పరిశ్రమలకు రూ.702.88 కోట్ల లక్ష్యం కాగా, రూ.754.81 కోట్లు మంజూరు చెయ్యడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగానికి రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, వెంటనే కొత్త రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకాల గ్రౌండింగ్ వేగంగా చేయాలని చెప్పారు. వరంగల్ లీడ్ బ్యాంక్ డిసెంబర్ త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో డిజిటల్ బ్యాంకింగ్ పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు.


ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, మొత్తం ప్రాధాన్యత రంగాలకు 2 వేల 482 కోట్ల 60 లక్షల రుణాలు పంపిణీ చేశామన్నారు. వ్యవసాయ టర్మ్ లోన్లు ఇవ్వడం ఇంకా వేగవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. మొత్తం రూ.550 కోట్లకు గాను రూ.245 కోట్లు ఇచ్చారని, ఇంకా రూ.205 కోట్లు తొందరగా పూర్తి చేయాలని సూచించారు. 2019-20 ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వరంగల్ జిల్లా ప్రధాన మంత్రి అవార్డుకు ఎన్నిక కావాలని ఆకాంక్షించారు.  సెంట్రల్ బాంక్ అఫ్ ఇండియా, బాంక్ అఫ్ బరోడా, బాంక్ అఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బాంక్, ఇండియన్ ఓవర్సీస్ బాంక్, ప్రైవేటు బ్యాంకులలో ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు, కోటక్ మహేంద్ర బ్యాంకు, కర్ణాటక బ్యాంకులు వివిధ రుణాలలో ఇవ్వడంలో ఆలస్యం అవుతున్నదన్నారు. అలాంటి బ్యాంకుల పైన తగిన చర్యలు తీసుకొని పై అధికారులకు తెలియ చెయ్యాలన్నారు. 


మహిళా స్వయం సహాయక సంఘాల రుణ మంజూరులో రాష్ట్రంలోనే వరంగల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. రూ.328.13 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 337.34 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. ఈ ఘనత సాధించిన బ్యాంకు అధికారులకు, జిల్లా అధికారులు, జిల్లా కలెక్టర్ ను మంత్రి అభినందించారు. మత్స్యకారులకు, గొల్ల కుర్మలకు, పాల ఉత్పత్తి దారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఎన్నడూ లేని విధంగా వరంగల్ జిల్లాలోనే ఎక్కువగా జారీచేశామన్నారు. KCC మత్స్యకారులకు 456 లోన్లు, గొల్ల కుర్మలకు, పాలఉత్పత్తి దారులకు 333 లోన్లను మంజూరు చేశామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బ్యాంకు మేనేజర్ల సహాయంతో కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. 14 ఫిబ్రవరి నుండి 18 ఫిబ్రవరి వరకు RBI ఆర్ధిక అక్షరాస్యత వారోత్సావాలలో భాగంగా, అన్ని గ్రామీణ బ్యాంకు శాఖలలో గో డిజిటల్, గో సెక్యూర్ అనే నినాదంతో డిజిటల్ లావాదేవీలు, వాటి భద్రత గురించి అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ నేపథ్యంలోనే SC, ST, PMEGP ముద్ర, స్టాండ్ అప్ ఇండియా రుణాలకు అర్హులైన అందరికీ అందజేయాలని మంత్రి అధికారులకు చెప్పారు.