PM Modi Punjab Rally: అమ్మవారి దర్శనానికి అయ్యగారు అనుమతివ్వలేదు: పంజాబ్ సర్కార్‌పై మోదీ సెటైర్లు

ABP Desam   |  Murali Krishna   |  14 Feb 2022 06:04 PM (IST)

పంజాబ్ జలంధర్‌లో ఉన్న శక్తిపీఠానికి వెళ్లేందుకు పోలీసులు ఏర్పాట్లు చేయలేమని చెప్పారని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానికే భద్రత కల్పించలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ తన తొలి ప్రచారసభను నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్‌పై సెటైర్లు, పంచులు వేశారు. పంజాబ్‌ను రిమోట్ కంట్రోల్‌తో పాలించలేమని తెలిసిన తర్వాత కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను సీఎం పదవి నుంచి తప్పించారని ఆరోపించారు.

ఎంతోమంది గురువులు, పీర్లు, విప్లవకారులు, ఆర్మీ జనరల్స్‌ను దేశానికి అందించిన ఈ పురిటిగడ్డపై నిల్చొని మాట్లాడటం సంతోషంగా ఉంది. ఈ సభ పూర్తయ్యాక త్రిపురమాలిని దేవీ శక్తిపీఠానికి వెళ్లి దర్శనం చేసుకుందామనుకున్నాను. కానీ రాష్ట్ర యంత్రాంగం, పోలీసులు.. ఏర్పాట్లు చేయలేమని చెప్పారు. ఇదీ ఇక్కడి ప్రభుత్వ దుస్థితి. కానీ త్వరలోనే శక్తి పీఠానికి వస్తాను.                                                           -    ప్రధాని నరేంద్ర మోదీ

అందుకే తీసేశారు

దిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌తో పాలించలేమని తెలిసే కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ను సీఎం పదవి నుంచి కాంగ్రెస్ తొలగించిందని మోదీ ఆరోపించారు.

భద్రతా లోపం వల్ల

ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రచార సభ ఉండటంతో పోలీసులు.. జలంధర్‌లో పెద్ద ఎత్తున కవాతు నిర్వహించారు. జనవరి 5న ప్రధాని మోదీ.. ఫిరోజ్‌పుర్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తడంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

పంజాబ్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ జనవరి 5న ఫిరోజ్‌పుర్ వెళ్లారు. అయితే మార్గ మధ్యంలో ఓ ఫ్లైఓవర్‌పై ప్రధాని కాన్వాయ్‌ను కొంత మంది నిరసనకారులు అడ్డుకున్నారు. ఇది భద్రతాపరమైన సమస్యలకు కారణమైంది. దీంతో ప్రధాని మోదీ తిరిగి భఠిండా విమానాశ్రయానికి వెళ్లారు. అటు నుంచి దిల్లీకి పయనమయ్యారు.

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని కోరింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అయితే భద్రతా వైఫల్యాల వల్లే ప్రధాని పర్యటన రద్దయిందనే వాదనను పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖండించారు. అసలు ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో వస్తున్నారనే సమాచారమే తమకు అందలేదన్నారు. ప్రధాని పర్యటన రద్దు కావడంపై చింతిస్తున్నామన్నారు.

Also Read: Air India New CEO: ఎయిర్‌ ఇండియా కొత్త సీఈఓగా ఐకెర్ ఆయ్‌సీ- ఎవరో తెలుసా?

Published at: 14 Feb 2022 06:04 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.